బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ | Telangana Excise Minister Srinivas Goud Criticizes BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

Sep 6 2022 1:49 AM | Updated on Sep 6 2022 3:15 PM

Telangana Excise Minister Srinivas Goud Criticizes BJP - Sakshi

ప్రశ్నించే వారిని అణచి వేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఇతర రాష్ట్రాల్లో మాదిరి తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రశ్నించే వారిని అణచి వేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఇతర రాష్ట్రాల్లో మాదిరి తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. దేశాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్న బీజేపీ నేతల మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేర న్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలసి సోమవారం ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేవలం ఒకరిద్దరు వ్యాపారుల కోసమే పనిచేస్తూ, ఏ వర్గానికీ కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం ద్వారా రిజర్వేషన్ల ఎత్తివేతకు కేంద్రం కుట్ర పన్నిందని, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రభుత్వాలను కూల్చడమే ఎజెండాగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. 

భోజనాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు
బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చి భోజనాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని, మహబూబ్‌నగర్‌లో కేంద్ర మంత్రి మహేంద్రనాథ్‌ పాండే 2 రోజుల పర్యటనతో ఇదే విషయం స్పష్టమైందని శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. జిల్లా స్థితిగతులు తెలుసుకోకుండా కేంద్ర మంత్రి విమర్శలు చేశారని, కేసీఆర్‌ పాలనలోనే పాలమూరు జిల్లా దశ మారిందని స్పష్టం చేశారు. తెలంగాణకు కేసీఆర్‌ ఏం చేశారో తెలుసుకునేందుకు బీజేపీ నేతలు గ్రామాల్లో పర్యటించాలని ఎమ్మెల్యే అంజయ్య అన్నారు. వ్యవసాయం గురించి మాట్లాడే హక్కు బీజేపీ నేతలకు లేదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు.

ఇదీ చదవండి: దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు: మంత్రి తలసాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement