రోడ్డురోలర్‌ కొట్టేసి.. తుక్కుకింద అమ్మేసి.. | Road roller Thief Arrested in hyderabad | Sakshi
Sakshi News home page

రోడ్డురోలర్‌ కొట్టేసి.. తుక్కుకింద అమ్మేసి..

Mar 1 2025 8:21 AM | Updated on Mar 1 2025 8:21 AM

Road roller Thief Arrested in hyderabad

మహారాష్ట్రలో చోరీ.. 

మహబూబాబాద్‌లో అమ్మకం..  

మహబూబాబాద్‌ రూరల్‌: బంగారం, వెండి, డబ్బులు, ఇతర వస్తువులు చోరీ జరగడం సాధారణమే. కానీ టన్నులకొద్దీ బరువుండే రోడ్డు రోలర్‌ను కొందరు దొంగలు అపహరించి.. పాత ఇనుప సామాను దుకాణంలో అమ్మేసి డబ్బుతో ఉడాయించారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన తండ్రీకొడుకులు ఎస్‌.కే.బడేమియా, ఖాదర్, కరీమ్‌ ఉమ్మడిగా పాత ఇనుప సామాను (స్క్రాప్‌) దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. 

కాగా కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ పట్టణానికి చెందిన ఎంఎస్‌ కన్‌స్ట్రక్షన్‌ సివిల్‌ రైల్వే కాంట్రాక్టర్‌ మోహన్‌మిశ్రా పేరిట ఉన్న రోడ్డురోలర్‌ను.. కొందరు వ్యక్తులు జేసీబీతో పాత ఇనుప సామాను దుకాణానికి తీసుకొచ్చారు. రూ.2.19 లక్షలకు దాన్ని విక్రయించి, వచ్చిన నగదుతో వెళ్లిపోయారు. కాగా, చోరీ చేసి తీసుకువచ్చి విక్రయించారని గ్రహించని స్క్రాప్‌ దుకాణం నిర్వాహకులు రోడ్డురోలర్‌ను గ్యాస్‌ కట్టర్‌తో ముక్కలు చేసే పనిలో నిమగ్నం కాగా.. వారికి ఒక ఫోన్‌ వచ్చింది.

రోడ్డురోలర్‌ యజమానిని మాట్లాడుతున్నానని.. ఇటీవల చోరీ అయిన తన రోడ్డురోలర్‌ను ఎలా కొనుగోలు చేశారని అవతలి వ్యక్తి ప్రశ్నించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో తమను మోసగించి విక్రయించారని దుకాణ యజమానులు లబోదిబోమన్నారు. రోడ్డురోలర్‌ చోరీ, విక్రయంపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement