సాక్షి, వికారాబాద్: కొడంగల్ శ్రీవారి ఆలయాన్ని పేదల తిరుపతిగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు( శుక్రవారం) కొడంగల్లో పర్యటించిన సీఎం వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో ఈ ప్రాంత పిల్లలు ఇతర ప్రాంతాలకు చదువుకోసం వెళ్లేవారని ఇప్పుడు మాత్రం ఇతర ప్రాంతాల నుంచి చదువుకోసం ఇక్కడికి వస్తున్నారని తెలిపారు.
కొడంగల్లో వచ్చిన మార్పును ప్రజలు గమనించాలని రాష్ట్ర అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతున్నానని సీఎం తెలిపారు. కొడంగల్ బిడ్డ తెలంగాణకు సీఎంగా ఉన్నారని తెలిపారు.వికారాబాద్- కృష్ణా రైల్వే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్నా గతంలో తాగు, సాగునీరుకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారు. కొడంగల్ నారాయణ పేట భూసేకరణ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని త్వరలోనే కృష్ణా జలాలు కొడంగల్ని ముద్దాడాలన్నారు.
పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు. దేశంలో ఉండే గొప్పగొప్ప పరిశ్రమలు రెండేళ్లలో కొడంగల్కు వచ్చాయన్నారు.ఈ ప్రాంత నాయకులు రాజకీయాలు పక్కనబెట్టి ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాలని సీఎం రేవంత్ ఈ సందర్భంగా కోరారు.


