‘ఆర్‌ఎఫ్‌సీఎల్‌’లో లీకవుతున్న గ్యాస్‌

Ramagundam: Gas Leaking From RFCL - Sakshi

భయం గుప్పిట్లో ప్రభావిత గ్రామాల ప్రజలు

పట్టించుకోని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు

ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత అంటున్న ప్రజలు 

సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్‌ కెమికల్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో వారంరోజులుగా అమ్మోనియా, యూరియా ఉత్పత్తిపై ట్రయల్‌ ర న్‌ నిర్వహిస్తున్నారు. అమ్మోనియా ప్లాంట్‌లో పై ప్‌లైన్‌ నిర్మాణంలో ఏర్పడిన సమస్య కారణంగా క ర్మాగారం నుంచి గ్యాస్‌ లీకవుతోంది. వారం క్రితం నైట్రోజన్‌ పైప్‌ లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మార్చి నెలాఖరులో యూరియా ప్లాంట్‌ను షట్‌డౌన్‌ చేశారు. 45 రోజుల మరమ్మతు అ నంతరం తిరిగి యూరియా ప్లాంట్‌లో ఉత్పత్తిపై అ ర్ధరాత్రి సమయంలో ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్నారు. 

భయం గుప్పిట్లో ప్రభావిత గ్రామాలు.. 
కర్మాగారానికి ఆనుకుని వీర్లపల్లి, లక్ష్మీపురం, ఎల్కలపల్లి గేట్, విఠల్‌నగర్, శాంతినగర్, తిలక్‌నగర్, గౌతమినగర్, చైతన్యపురికాలనీ, సంజయ్‌గాంధీనగర్‌ ఉంటాయి. ట్రయల్‌ రన్‌ సమయంలో లీకవుతున్న గ్యాస్‌ సమీప గ్రామాలను చుట్టేస్తోంది. దీంతో ఊపిరాడడం లేదని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నామని ప్రజలు చెబుతున్నారు.

హై పవర్‌ టెక్నికల్‌ కమిటీ ఏర్పాటు చేయాలి
రామగుండం ఫెర్టిలైజర్స్‌ కెమికల్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో ట్రయల్‌ రన్‌ సమయంలో ప్లాంట్‌ నుంచి రెండు రోజులుగా బయటకు వస్తున్న గ్యాస్‌తో ప్రభావిత ప్రాంతాలలో శ్వాస ఆడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిర్మాణ క్రమంలో నాణ్యత పాటించకపోవడంతోనే నిత్యం ఇలాంటివి జరుగుతున్నాయని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ వర్కింగ్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ అంబటి నరేష్‌ అన్నారు. కేంద్ర ఎరువులు రసాయనాల శాఖామంత్రి స్పందించి కర్మాగా రంలో జరుగుతున్న ప్రమాదాలపై హై పవర్‌ టెక్నికల్‌ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 

విచారణ జరిపి చర్యలు చేపట్టాలి
రామగుండం ఫెర్టిలైజర్స్‌ కెమికల్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో రెండురోజులుగా వెలువడుతున్న నైట్రోజన్‌ గ్యాస్‌తో ప్రభావిత గ్రామాలతోపాటు గోదావరిఖని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మంగళవారం పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఇంజినీర్‌ కె.రవిదాస్‌కు వినతిపత్రం అందించారు. ప్లాంట్‌ నుంచి వెలువడుతున్న గ్యాస్‌తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.   

కాలుష్య నియంత్రణ అధికారికి వినతులు
జ్యోతినగర్‌: ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో అమ్మోనియా గ్యాస్‌ లీకేజీపై సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫైట్‌ఫర్‌ బెటర్‌ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్, ఉపాధ్యక్షుడు కొమ్మ చందు యాదవ్‌ ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి రవిదాస్‌కు మంగళవారం వినతిపత్రం అందించారు. సోమవారం ఉదయం గ్యాస్‌ లీక్‌ కావడంతో ప్రజలు గంటపాటు వాసనతో ఉలిక్కిపడ్డారని, పెంచికల్‌పేట, లక్ష్మీపురం, వీర్లపల్లిలో ప్రభావం అధికంగా ఉందని, గౌతమినగర్, ఇందిరానగర్, తిలక్‌నగర్, విఠల్‌నగర్, అడ్డగుంటపల్లి, ఐదో ఇంక్లైన్, గోదావరిఖని, లక్ష్మీనగర్, కళ్యాణ్‌నగర్‌ వరకూ గ్యాస్‌ వ్యాపించిందని పేర్కొన్నారు. అమ్మోనియం లీక్‌ అవుతున్నా యాజమాన్యం స్పందించడం లేదన్నారు. దీనికి కాలుష్య నియంత్రణ అధికారి రవిదాస్‌ విచారణ చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top