Hyderabad: నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య | Nursing student Ends Life In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

Feb 8 2025 7:21 AM | Updated on Feb 8 2025 7:21 AM

Nursing student Ends Life In Hyderabad

 ప్రియుడి వేధింపులే కారణం.. 

బౌద్ధనగర్‌,హైదరాబాద్‌: ప్రేమించిన వ్యక్తి తరచూ అనుమానిస్తూ..వేధింపులకు పాల్పడడంతో భరించలేక ఓ నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వారాసిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బౌద్ధనగర్‌లోని అంబర్‌నగర్‌కు చెందిన నాగయ్య కుమార్తె ప్రవళిక (23) కోఠి ఉమెన్స్‌ కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్‌ చదువుతుంది. కాలేజీ అయ్యాక సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు వారాసిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తుంది. 

కాగా నాలుగేళ్లుగా ప్రవళిక..సృజన్‌ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా సృజన్‌ ఆమెను వేధిస్తూ వేధింపులకు దిగాడు. మరో యువకుడితో మాట్లాడుతున్నావని అనుమానించేవాడు. ఇదే విషయంపై పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ నెల 6వ తేదీన సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీలోని ఓ బేకరీలో ప్రవళిక, సృజన్‌ల మధ్య వాగి్వవాదం జరిగింది. దీంతో మరో స్నేహితుడు మధుకర్‌ వచ్చి ఇద్దరిని సముదాయించాడు. 

ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన ప్రవళిక తన తండ్రి నాగయ్యకు ఫోన్‌ చేయగా, తాను ఫంక్షన్‌కు వెళ్తున్నానని ఆలస్యంగా వస్తానని చెప్పాడు. అర్థరాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చిన నాగయ్యకు బెడ్రూమ్‌లో ప్రవళిక దుప్పటితో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో ప్రవళికను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రవళిక స్నేహితుడు మధుకర్‌..సృజన్‌తో ప్రేమ, గొడవల గురించి నాగయ్యకు తెల్పగా..ఆయన ఫిర్యాదు మేరకు సృజన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement