
వాతావరణ శాఖ అంచనా
హైదరాబాద్ సహా 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. రాష్ట్రంలో చురుకుగా నైరుతి
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా శం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఉత్తర జిల్లాల్లో విస్తరించాయి. రానున్న 3 రోజుల్లో పూర్తిస్థాయిలో విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
రుతుపవనాల కదలికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఆదిలాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెద క్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఉక్కపోత కూడా క్రమంగా తగ్గుతోంది. గురువారం చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు, కొన్నిచోట్ల సాధారణం కంటే తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్లో 40.1 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్లో 23.3 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యాయి.