ముందస్తు నివారణ చర్యలే మేలు | Minister Ponguleti on the damage caused by heavy rains and floods | Sakshi
Sakshi News home page

ముందస్తు నివారణ చర్యలే మేలు

Jun 13 2025 3:39 AM | Updated on Jun 13 2025 3:39 AM

Minister Ponguleti on the damage caused by heavy rains and floods

భారీ వర్షాలు, వరదల నష్టంపైమంత్రి పొంగులేటి  

వరద ముప్పు కట్టడికి హైదరాబాద్‌ మాదిరి జిల్లాల్లో ఏర్పాట్లు 

ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం బలోపేతానికి ఉన్నతస్థాయి కమిటీ  

ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాలతో తీవ్ర నష్టం జరిగిన తరువాత స్పందించడం కంటే.. నష్టం జరగకముందే నివారణ చర్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) చెపుతున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి గురువారం సచివాలయంలో ప్రకృతి విప త్తుల నిర్వహణ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధి కారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ హైదరాబాద్‌ తరహాలోనే జిల్లాల్లో వరదల ముప్పును ఎదుర్కొనేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. విపత్తుల నిర్వహణ విభాగం బలోపేతానికి హైడ్రా కమిషనర్, అగి్నమాపక డీజీ, విపత్తుల నిర్వహణ కమిషనర్, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ డైరెక్టర్, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, ఆరోగ్య శాఖల కమిషనర్‌లతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని వివరించారు. తర్వాత కమిటీ నివేదిక ప్రకారం చర్యలు చేపడ్తామని తెలిపారు. 

వర్షాకాలం ముందుస్తుగానే వచ్చిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని వైపరీత్యాల ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించాలని మంత్రి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వచ్చే భారీ వర్షాల వల్ల ఊహించని వరదలు వస్తున్నాయని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పరీవాహక ప్రాంతాల్లోని నివాసితులను గుర్తించి వారిని అక్కడి నుంచి శాశ్వతంగా తరలించి, వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  

మూసపద్ధతికి స్వస్తి చెప్పండి.. 
విపత్తుల నిర్వహణ విభాగం మూసపద్ధతికి స్వస్తి చెప్పి, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పద్ధతులను, పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులను కోరారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి వరదల కార్యాచరణ ప్రణాళికలను ఈనెల 30వ తేదీలోగా తయారు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే వరద నియంత్రణ కట్టలు, చిన్న–మధ్య తరహా కాల్వలు, వర్షపు నీటి డ్రెయిన్‌లు.. మొదలైన వాటిని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలన్నారు. బోట్లు, లైఫ్‌ జాకెట్లు, అత్యవసర ఆహార కిట్లను ముందే సిద్ధం చేసుకోవాలని చెప్పారు. 

ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని, స్థానిక సహాయక బృందాలను ఏర్పాటు చేసి, వారికి బాధితులను తరలించడం, తక్షణ స్పందన చర్యలపై శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిత్తల్, విపత్తుల నిర్వహణ కమిషనర్, అగ్నిమాపక విభాగం డైరెక్టర్‌ జనరల్‌ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్, పంచాయితీరాజ్‌ కమిషనర్‌ సృజన, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement