తెలంగాణ వైద్య విద్య దేశానికే ఆదర్శం | Minister Harish Rao Inaugurates Dialysis Center In Choutuppal Hospital | Sakshi
Sakshi News home page

తెలంగాణ వైద్య విద్య దేశానికే ఆదర్శం

Jan 4 2023 1:04 AM | Updated on Jan 4 2023 1:04 AM

Minister Harish Rao Inaugurates Dialysis Center In Choutuppal Hospital - Sakshi

చౌటుప్పల్‌ ఆస్పత్రిలో డయాలసిస్‌ యంత్రాన్ని ప్రారంభిస్తున్న హరీశ్‌రావు. చిత్రంలో ∙జగదీశ్‌రెడ్డి, లింగయ్యయాదవ్, ప్రభాకర్‌రెడ్డి  

చౌటుప్పల్‌: తెలంగాణలోని వైద్యవిద్య దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సమైక్య పాలనలో వైద్యవిద్యను అభ్యసించాలంటే విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్‌ దేశాలకు వెళ్లాల్సి వచ్చేదని, సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో ప్రస్తుతం వైద్యం, వైద్య విద్య గ్రామీణ ప్రాంతాలకే వచ్చిందన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ సెంటర్‌ను మంగళవారం విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో కలిసి హరీశ్‌ రావు ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 107 కళాశా లలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు.  సమైక్య పాలనలో తెలంగాణలో ఉస్మానియా, గాంధీ, వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రుల్లో మాత్రమే కిడ్నీ డయాలసిస్‌ సెంటర్లు ఉండేవని, వీటిని 102కు పెంచామన్నారు.

ప్రతి ఏడాది డయాలసిస్‌ సెంటర్లకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని, కిడ్నీ బాధితులపై ఒక్క పైసాకూడా భారం పడకుండా సేవలు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారని చెప్పారు. తెలంగాణకు ఎయిమ్స్‌ ఇస్తామంటే బీబీనగర్‌లోని రూ.500 కోట్ల విలువ చేసే భూమి, భవనాలను కేంద్రానికి అప్పగించా మని, నాలుగేళ్లలో అక్కడ తట్టెడు మట్టికూడా పోయలేదని ధ్వజమెత్తారు.   

Advertisement
 
Advertisement
Advertisement