సాక్షి, హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్ జలవిహార్ సమీపంలో ఉన్న ఆర్ఓ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. నీటి సరఫరా కోసం ఉపయోగించే ఈ ప్లాంట్లో ఒక్కసారిగా పేలుడు ధాటికి పరికరాలు తునాతునకలయ్యాయి. ఈ ఘటనలో ప్లాంట్ వద్ద పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కంప్రెషర్లో అధిక ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఖైరతాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పేలుడు కారణాలపై విచారణ చేపట్టారు.


