సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న మహాలక్ష్మి(మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకం విజయ పథంలో దూసుకుపోతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లబ్ధిదారులైన మహిళలు కోట్ల సంఖ్యలో పొందిన ఉచిత ప్రయాణాల విలువ రూ. 10,000 కోట్ల చరిత్రాత్మక మార్కును చేరుకుందని టీజీఎస్ ఆర్టీసీ వెల్లడించింది.
ఈ చారిత్రాత్మక విజయాన్ని వేడుకగా జరుపుకోవడానికి, ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన లబ్ధిదారులను అభినందించడానికి టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని ఇవాళ సాయంత్రం (మార్చి 31, మంగళవారం) బేగంపేటలోని జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ (ప్రగతి భవన్)లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొనున్నారు.
మహాలక్ష్మి పథకం 2023 డిసెంబరు 9న ప్రారంభం కాగా, ఈ స్కీమ్ ద్వారా మహిళలు ఏకంగా రూ.10వేల కోట్లను ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మహిళలు సుమారు 290 కోట్ల సార్లు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించినట్లు ప్రభుత్వం చెబుతోంది.
మహాలక్ష్మి స్కీమ్ సేవల కోసం త్వరలో మహిళలకు చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులు ఇస్తామని టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. రోజుకు సగటున 35 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని.. పథకం తర్వాత మహిళా ప్రయాణికుల శాతం 40 నుంచి 67కు పెరిగిందని అధికారులు చెబుతున్నారు.


