ఆర్టిజన్లను విస్మరిస్తే రాష్ట్రవ్యాప్త సమ్మె | Mahadharna under the auspices of Telangana Vidyut Artisans Conversion JAC | Sakshi
Sakshi News home page

ఆర్టిజన్లను విస్మరిస్తే రాష్ట్రవ్యాప్త సమ్మె

Oct 18 2024 4:22 AM | Updated on Oct 18 2024 4:22 AM

విద్యుత్‌ ఆర్టిజన్స్‌ కన్వర్షన్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ ఈశ్వర్‌రావు

హనుమకొండ: ఆర్టిజన్‌లను కన్వర్షన్‌ చేయకుండా రిక్రూట్‌మెంట్‌కు వెళ్తే రాష్ట్రవ్యాప్త సమ్మెకు వెళ్తామని తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్స్‌ కన్వర్షన్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ కె.ఈశ్వర్‌రావు హెచ్చరించారు. రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అర్హులైన ఆర్టిజన్‌లతో భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం ఎదుట తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్స్‌ కన్వర్షన్‌ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు. 

ధర్నాకు టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 16 జిల్లాల నుంచి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా ఆర్టిజన్‌ ఉద్యోగులు తరలివచ్చారు. ధర్నా అనంతరం సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డికి జేఏసీ నాయకులు వినతి పత్రం అందించారు. అంతకుముందు కె.ఈశ్వర్‌రావు మాట్లాడుతూ, ఆర్టిజన్‌లను కన్వర్షన్‌ చేసే వరకు జేఎల్‌ఎం, సబ్‌ ఇంజనీర్, జూనియర్‌ అసిస్టెంట్, ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు భర్తీ చేయొద్దన్నారు. 

ప్రజావాణిలో డిప్యూటీ సీఎంను జేఏసీ నాయకులు కలిస్తే పరిశీలిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. 23వేల మంది ఆర్టిజన్‌లను కన్వర్షన్‌ చేయకుండా 3,500 మందిని రిక్రూట్‌మెంట్‌ చేస్తామని యాజమాన్యం చెబుతుందని, ఆర్టిజన్‌లను కన్వర్షన్‌ చేయకుండా రిక్రూట్‌మెంట్‌కు వెళ్తే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement