
నేడు షెడ్యూల్ ప్రకటిస్తామన్న ఉన్నత విద్యామండలి చైర్మన్
ముఖ్యమంత్రి జోక్యంతో దారికొచ్చిన అధికారులు
కలిసి ప్రకటిస్తారా లేదా అనే దానిపై సందిగ్ధత
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు ముందుకు కదిలింది. శుక్రవారం షెడ్యూల్ ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ప్రకటించారు. జేఎన్టీయూహెచ్లో జరిగిన పీజీఈసెట్ ఫలితాల వెల్లడి సందర్భంగా కౌన్సెలింగ్పై ఆయన ప్రకటన చేశారు. వాస్తవానికి జూలై మొదటి వారంలో షెడ్యూల్ ఇస్తామని ఆయన కొన్ని రోజుల క్రితం చెప్పారు. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి తేదీలను అనుసరిస్తామని సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన బుధవారం చెప్పారు.
ఈ నెల 30 తర్వాతే షెడ్యూల్ వెలువడుతుందనే సంకేతాలిచ్చారు. కానీ ఊహించని విధంగా శుక్రవారం నాడే షెడ్యూల్ ఇస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రకటించారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ విషయంలో సాంకేతిక, విద్యాశాఖ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఆగమేఘాల మీద షెడ్యూల్ విడుదలకు సిద్ధమైనట్లు సమాచారం.
ఎవరికి వారే..
కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఇవ్వబోతున్నామని మీడియాకు తెలియజేసేందుకు సాంకేతిక విద్య అధికారులు గురువారం ప్రెస్నోట్ సిద్ధం చేశారు. ఈలోగానే జేఎన్టీయూహెచ్లో మండలి చైర్మన్ షెడ్యూల్ ఇస్తున్న విషయాన్ని ప్రకటించారు. దీంతో సాంకేతిక, విద్యాశాఖ ఉన్నతాధికారులు షాక్ తిన్నారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదలకు రావాలంటూ కబురు అందడంతో సాంకేతిక విద్య అధికారులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
‘మేమెందుకు.. షెడ్యూల్ మీరే ఇచ్చుకోండి. మీ ఆఫీసుకొచ్చి కూర్చోవడం తప్ప ఏం చేయాలి..’ అంటూ ఓ అధికారి వ్యాఖ్యానించినట్లు ఉన్నత విద్యామండలి వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందడంతో షెడ్యూల్ విడుదల కార్యక్రమానికి వెళ్లాలంటూ సాంకేతిక, విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కలిసి షెడ్యూల్ విడుదల చేస్తారా? ఉన్నత విద్యా మండలి అధికారులే ఇస్తారా? అనే సందిగ్ధత నెలకొంది.
అసలేం జరుగుతోంది?: సీఎం
విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ.. మండలి అధికారుల మధ్య సమన్వయ లోపంపై ముఖ్య మంత్రి కార్యాలయం దృష్టి పెట్టింది. సీఎం సలహా మేరకు ఓ ప్రత్యేక బృందాన్ని ఈ పని కోసం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. సమీక్షకు పిలిస్తే చాలు మండలి అధికారులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా సాంకేతిక, విద్యాశాఖ అధికారులు వ్యవహరించడం సీఎంవో వర్గాలను నివ్వెరపరుస్తోంది. దీంతో ఆయా విభాగాల మధ్య అసలేం జరుగుతోందో అని సీఎంవో ఆరా తీస్తోంది. వీలైనంత త్వరగా రెండు వర్గాలతో ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరిపి పరిస్థితిని చక్కదిద్దాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. విద్యాశాఖ ముఖ్యమంత్రి అధీనంలో ఉన్న నేపథ్యంలో తాజా పరిణామాలపై ఆయన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.