సాక్షి, హైదరాబాద్: కోకాపేటలో రియల్ సంస్థలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) భూముల రెండో విడత వేలంలో మరో రికార్డు నమోదైంది. ఎకరం ధర అత్యధికంగా రూ.151 కోట్లు పలికింది.
గోల్డెన్ మైల్లోని ప్లాట్నెంబర్ 15, ప్లాట్నెంబర్ 16 భూములకు శుక్రవారం వేలం జరిగింది. అయితే.. ప్లాట్ నెంబర్ 15లో ఎకరానికి రూ.151.25 కోట్ల ధర పలికింది. జీహెచ్ఆర్ ఇన్ఫ్రా ఈ ధరకు భూముల్ని దక్కించుకుంది. ఈ ప్లాట్లో 4.03 ఎకరాలకుగాను రూ.609 కోట్ల 55 లక్షలను హెచ్ఎండీ పొందింది.
ఇక ప్లాట్ నెంబర్ 16లో(మొత్తం 5.03 ఎకరాలు) ఎకరం ధర రూ.147.75 కోట్లు పలికింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ ఈ ప్లాట్ను సొంతం చేసుకుంది. కోకాపేట నియోపోలిస్లో హెచ్ఎండీఏ తన భూముల్ని వేలం వేస్తున్న సంగతి తెలిసిందే.
మొదటి విడత వేలంలో వచ్చిన ఆదాయం కలుపుకుని, ఇప్పటివరకు ఆక్షన్ల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.2,708 కోట్ల ఆదాయం సమకూరింది. డిసెంబర్ 3, డిసెంబర్ 5వ తేదీల్లో గోల్డెన్ మైల్లోని మిగతా ప్లాట్లకు వేలం జరగనుంది. చివరి ఆక్షన్ కావడంతో ఈ రికార్డులు బద్ధలు అవుతాయో లేదో చూడాలి.


