IND Vs AUS: భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌.. ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా

IND Vs AUS 3rd T20I Rajiv Gandhi Stadium Uppal Traffic Diversions-Parking - Sakshi

సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్‌: ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం జరగనున్న టీ–20 మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. రాచకొండ పోలీసులు 2,500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్‌ స్క్వాడ్, బాంబ్‌ డిస్పోజల్, ఆక్టోపస్, ట్రాఫిక్, లా అండ్‌ ఆర్డర్, స్పెషల్‌ బ్రాంచ్, ఐటీ సెల్, షీ టీమ్స్‌ అన్ని పోలీసు విభాగాలు విధుల్లో ఉంటాయని రాచకొండ  పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. మైదానం, పరిసర ప్రాంతాల్లో 300 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని బంజారాహిల్స్‌ లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించారు. 

ట్రాఫిక్‌ ఆంక్షలిలా.. 
మైదానం చుట్టూ నేటి మధ్యాహ్నం నుంచి తెల్లవారు జాము వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఉప్పల్‌ నుంచి సికింద్రాబాద్‌ మార్గంలో భారీ వాహనాలకు అనుమతి లేదు. సికింద్రాబాద్, ఎల్బీనగర్‌ నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలను కూడా ప్రవేశం లేదు. గేట్‌– 1 వీఐపీ ద్వారంలోని పెంగ్విన్‌ గ్రౌండ్‌లో 1,400 కార్లకు పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. స్డేడియం నలువైపులా అయిదు క్రేన్లు అందుబాటులో ఉంటాయి. ఎన్‌జీఆర్‌ఐ గేట్‌ –1, జెన్‌ప్యాక్ట్‌లకు రోడ్డుకిరువైపులా ద్విచక్ర 
వాహనాలను పార్కింగ్‌ చేసుకోవచ్చు. పార్కింగ్‌  ఏర్పాట్లపై ప్రత్యేక యాప్‌ ఉంటుంది. టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి రూట్‌ను చూపించే యాప్‌ మెసేజ్‌ రూపంలో వస్తుంది. 

21 పార్కింగ్‌ ప్రాంతాలు 
ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 370 మంది ట్రాఫిక్‌ సిబ్బంది విధుల్లో ఉంటారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎక్కడ  ట్రాఫిక్‌  సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నటు  రాచకొండ ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. స్టేడియం చుట్టూ దాదాపు 21 పార్కింగ్‌ ప్రాంతాలను అందుబాటులో ఉంచామన్నారు.

వీటితో పాటు స్టేడియం చుట్టూ 7.5 కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌లపై పార్కింగ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. వీఐపీలకు ప్రత్యేక పార్కింగ్‌ ప్రాంతాలను కేటాయించినట్లు, ప్రధాన కూడళ్లు నాగోల్‌ చౌరస్తా, ఉప్పల్‌ చౌరస్తా, హబ్సిగూడ ఎల్‌జీ గోడౌన్‌ వద్ద, హబ్సిగూడ చౌరస్తాలో   పార్కింగ్‌ ప్రదేశాలను చూపే అతి పెద్ద  సమాచారమిచ్చే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

ట్రాఫిక్‌ మళ్లింపులు.. 
►ఉప్పల్‌ వైపు వచ్చే అన్ని భారీ వామనాలను దారి మళ్లించనున్నారు.  ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలను చెంగిచర్ల వద్దే దారి మళ్లిస్తారు.  ఎల్‌బీనగర్‌ నుంచి ఉప్పల్‌ వచ్చే వాహనాలను దారి మళ్లించి దిల్‌సుఖ్‌నగర్‌ మీదుగా వయా అంబర్‌పేట నుంచి పంపించనున్నారు.

వీటికి అనుమతి లేదు.. 
►స్టేడియం లోపలికి మొబైళ్లు, ఇయర్‌ ఫోన్లను మాత్రమే అనుమతిస్తారు. హెల్మెట్లు, కెమెరా, బైనాక్యులర్, ల్యాప్‌ట్యాప్, సిగరెట్లు, తినుబండారాలు, ఆల్కహాల్, మత్తు పదార్థాలు, సెల్ఫీ స్టిక్స్, హాల్‌పిన్స్, బ్లేడ్లు, చాకులు, వాటర్‌ బాటిళ్ల వంటివేవీ స్టేడియం లోనికి  అనుమతించరు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top