కోకాపేట్‌ తరహాలో.. మరో భారీ వెంచర్‌కు హెచ్‌ఎండీఏ ప్లాన్‌!

Hyderabad: Hmda Plans To Another Venture Near Rajendra Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మరో భారీ వెంచర్‌కు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సమీపంలో, ఎయిర్‌పోర్టు మెట్రో మార్గానికి దగ్గరలో రాజేంద్రనగర్‌ బుద్వేల్‌ వద్ద సుమారు 200 ఎకరాల్లో లేఅవుట్‌ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. మధ్యతగతి, ఉన్నత ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ఈ లేఅవుట్‌ అభివృద్ధి కోసం హెచ్‌ఎండీఏ రెండు రోజుల క్రితం టెండర్లను సైతం ఆహ్వానించింది.

200 ఎకరాల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలతో పాటు విల్లాల కోసం 2 నుంచి 3 ఎకరాల ప్లాట్‌లు, మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకొని 500 చదరపు గజాల నుంచి 600 చదరపు గజాల ప్లాట్‌ల చొప్పున ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎండీఏ  అధికారులు కార్యాచరణ సిద్థం చేశారు. రాజేంద్రనగర్‌ నుంచి శంషాబాద్‌ వరకు నగరానికి  దక్షిణం వైపు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న దృష్ట్యా ఈ లేఅవుట్‌కు భారీ డిమాండ్‌ ఉండే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లేఅవుట్‌ ఔటర్‌ రింగురోడ్డుకు దగ్గర్లో ఉండడం, రాయదుర్గం నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి  నిర్మించనున్న ఎయిర్‌పోర్టు మెట్రో మార్గానికి  చేరువలో ఉండడంతో బుద్వేల్‌ లేఅవుట్‌ హాట్‌కేక్‌లా అమ్ముడవుతుందని అధికారులు భావిస్తున్నారు.  

కోకాపేట్‌ తరహాలో..
నగరంలోని వివిధ ప్రాంతాల్లో  హెచ్‌ఎండీఏ ఎక్కడ లే అవుట్‌లను అభివృద్ధి చేసినా కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. హెచ్‌ఎండీఏ స్థలాల్లో ఎలాంటి వివాదాలు లేకపోవడం, ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసి ఇవ్వడం వల్ల డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఇటీవల  మేడ్చల్, ఘట్కేసర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో చేపట్టిన హెచ్‌ఎండీఏ స్థలాల  విక్రయాలకు కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. బాచుపల్లిలో చదరపు గజం అత్యధికంగా రూ.68 వేల వరకు డిమాండ్‌ రావడం  గమనార్హం. గతంలో ఉప్పల్‌లోనూ బిల్డర్‌లు, రియల్టర్‌లు, వ్యాపారవర్గాలు, మధ్యతరగతి  ప్రజలు  పెద్ద ఎత్తున పోటీపడ్డారు. నగర శివారు ప్రాంతాల్లో,  ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు అందుబాటులో అభివృద్ధి చేస్తున్న వెంచర్‌ల పట్ల  నగరవాసులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. 

సుమారు 500 ఎకరాల్లో కోకాపేట్‌లో అభివృద్ధి చేస్తోన్న నియో పోలీస్‌ లేఅవుట్‌ కు సైతం  కొనుగోలుదారుల నుంచి  ఆసక్తి కనిపిస్తోంది. నియో పోలీస్‌ లే అవుట్‌ అభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయి. కోకోపేట తరువాత  బుద్వేల్‌లో చేపట్టనున్న  ప్రాజెక్టు  అతిపెద్ద లేఅవుట్‌ అవుతుందని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం 200 ఎకరాల్లో దీన్ని చేపట్టి  విస్తరిస్తారు. అక్కడ  ప్రభుత్వభూమి అందుబాటులో ఉండడం వల్ల  350 ఎకరాల వరకు కూడా విస్తరించేందుకు అవకాశం ఉంది. కాగా.. జంట జలాశయాలకు సమీపంలో ఉన్న బుద్వేల్‌ లే అవుట్‌కు అన్నీ అనుకూలమైన అంశాలే  ఉన్నాయి.

చదవండి: సాత్విక్‌ మృతిపై కమిటీ రిపోర్ట్‌ ఇదే.. శ్రీచైతన్యకు షాక్‌!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top