భార్యను నడిరోడ్డుపై పొడిచి చంపిన భర్త..! | Husbands and Wives in Kodad and Hyderabad | Sakshi
Sakshi News home page

భార్యను నడిరోడ్డుపై పొడిచి చంపిన భర్త..!

May 7 2026 10:55 AM | Updated on May 7 2026 11:38 AM

Husbands and Wives in Kodad and Hyderabad

సూర్యాపేట జిల్లా: కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు భర్త. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్‌ ఎదరుగా బుధవారం జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా నేలకొండపలి్లకి చెందిన బత్తుల శిరీష(24), కోదాడ పట్టణ పరిధిలోని బాబునగర్‌కు చెందిన పాయిలి మణిదీప్‌ ఐదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో కోదాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో మణిదీప్‌ ఫిర్యాదు చేయడంతో..

ఆ కేసు నిమిత్తం శిరీష తన పెద్దమ్మను తీసుకొని బుధవారం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చింది. రాత్రి కావడంతో పోలీసులు గురువారం ఉదయం రమ్మని చెప్పడంతో శిరీష, ఆమె పెద్దమ్మ కలిసి ఏపీలోని జగ్గయ్యపేటకు వెళ్లేందుకు కోదాడ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఆటోస్టాండ్‌  వద్దకు చేరుకున్నారు. జగ్గయ్యపేటకు వెళ్లే ఆటోలో ఎక్కి కూర్చున్న శిరీషను ఆమె భర్త కిందకు లాగి కత్తితో పొడిచే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. వారిని నెట్టేసి ఆమె ఛాతీలో నాలుగైదుసార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై కిందపడిపోయింది. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి పెద్దమ్మ వెంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

ఉలిక్కిపడిన కోదాడ
కోదాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జన సంచారం ఉండే బస్టాండ్‌ సెంటర్‌లో ఈ హత్య జరగడంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. హత్య జరిగిన వార్త వాట్సాప్‌లో ప్రచారం కావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement