సాక్షి, హైదరాబాద్: నగరంలో వేసవి వేడి సెగలు పుట్టిస్తోంది. శనివారం భానుడు ప్రతాపం చూపించడంతో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 38.2, కనిష్టంగా 24.6 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. గాలిలో తేమ 23 శాతానికి పడిపోవడంతో పొడి వాతావరణం నెలకొంది. వాతావరణ శాఖ తాజా విశ్లేషణ ప్రకారం.. ఆదివారం 39 డిగ్రీల మార్కును తాకే అవకాశం ఉంది. ఈ నెల 30, 31 తేదీల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, అది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని భావిస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్కు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎండలు ముదురుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


