కథ సుఖాంతం; ఇంటికి చేరిన శ్రీనివాస్‌

Happy Reunion: Stranded Telangana Man Reaches Home From Sharjah - Sakshi

లెబనాన్‌ నుంచి వస్తూ షార్జాలో అరెస్టు

కార్మిక రక్షణ సమితి చొరవతో విముక్తి 

పెగడపల్లి(ధర్మపురి): లెబనాన్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తూ షార్జాలో జైలు పాలయిన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మ్యాక వెంకయ్యపల్లికి చెందిన శ్రీనివాస్‌ ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. శ్రీనివాస్‌ గల్ఫ్‌లో బందీ అయిన విషయంపై ‘సాక్షి’లో ‘జైలు నుంచి విడిపించరూ..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి గల్ఫ్‌కార్మిక రక్షణ సమితి సభ్యులు స్పందించారు. షార్జా జైలు నుంచి ఇంటికొచ్చిన శ్రీనివాస్‌ను బుధవారం ‘సాక్షి’పలకరించింది.

శ్రీనివాస్‌ 2013లో దుబాయ్‌కి వెళ్లగా జీతం తక్కువగా ఉండటంతో అక్కడే కల్లివెల్లి కార్మికుడిగా మారాడు. ఓ గదిలో పదిమందితో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో 2015లో గదిలో ఎవరో నల్లుల మందు పెట్టగా.. అది విషంగా మారి పక్క గదిలో ఉన్న ఒకరు చనిపోయారు. ఆ కేసులో సీఐడీ పోలీసులు శ్రీనివాస్‌ను జైలులో పెట్టి 20 రోజుల తర్వాత విడుదల చేయగా స్వగ్రామానికి వచ్చేశాడు.

తర్వాత 2018లో లెబనాన్‌ వెళ్లిన శ్రీనివాస్‌ ఈ ఏడాది మార్చి 24న షార్జా నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా శ్రీనివాస్‌పై కేసు ఉందని, రెండు నెలలు జైలుతోపాటు రూ.45 లక్షలు జరిమానా చెల్లించాలని చెప్పారు. ఆయన స్నేహితుడు ఈ విషయాన్ని గల్ఫ్‌కార్మిక రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నరసింహకు తెలపగా, ఆయన చొరవతో ఎలాంటి జైలుశిక్ష, జరిమానా లేకుండానే విడుదలై, స్వగ్రామం చేరుకున్నాడు.  

గల్ఫ్‌లో కార్మికుల గోస.. ఆదుకోవాలని వేడుకోలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top