రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం | Four People Died In Road Accident At Adilabad District | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

Dec 26 2022 3:17 AM | Updated on Dec 26 2022 3:31 PM

Four People Died In Road Accident At Adilabad District - Sakshi

తాంసి(బోథ్‌): ఆదిలాబాద్‌ జిల్లాలో అంతర్రాష్ట్ర రహదారిపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాంసి మండలం హస్నాపూర్‌ గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రమాద స్థలంలోనే మృతిచెందగా ఒకరు ఆస్పత్రిలో చనిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని కిన్వట్‌ తా లుకా అందుకోరి గ్రామానికి చెందిన సుజిత్‌రామ్‌ ఉపాధి కోసం భార్య వందన, కుమార్తె మనీష, కుమారుడు సంస్కార్‌తో కలసి ఇచ్చోడలో నివాసం ఉంటున్నాడు.

అక్కడ సుజిత్‌రామ్‌ టెంట్‌హౌస్‌లో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా, సుజిత్‌రామ్‌ సోదరుడి నిశ్చితార్థం ఉండటంతో శనివారం కుటుంబ సభ్యులతో కలసి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్లారు. శుభకార్యం అనంతరం ఆదివారం ఉదయం తిరిగి ఇచ్చోడకు బయల్దేరారు. అదే సమయంలో మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా ముంచ్‌ గ్రామానికి చెందిన ధన్వి నారాయణ ఆదిలాబాద్‌ వైపు నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నాడు.

హస్నాపూర్‌ వద్దకు రాగానే ఈ రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ధన్వి నారాయణ (30), సుజిత్‌రామ్‌ (38), మనీష (15) తలలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. సంస్కార్‌(11), సుజిత్‌ భార్య వందనకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు  ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంస్కార్‌ మృతిచెందాడు. పోలీసులు మృతదేహాలను రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement