Major Fire Accident In Telangana Bhavan Hyderabad During Victory Celebrations Of TRS Contestant - Sakshi
Sakshi News home page

సంబరాల్లో అపశ్రుతి.. తెలంగాణ భవన్‌లో మంటలు

Mar 20 2021 7:12 PM | Updated on Mar 20 2021 7:39 PM

Fire Accident In Telangana Bhavan, Hyderabad - Sakshi

తెలంగాణ భవన్ ఆవరణలో మంటలు అంటుకోవడం కలకలం రేపింది.

సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో తెలంగాణ భవన్ ఆవరణలో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాణిదేవీ గెలుపొందడంతో శనివారం సాయంత్రం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు సంబరాల్లో మునిగారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చడంతో నిప్పురవ్వలు ఎగిరి భవనం ఆవరణలో వేసిన చలవ పందిళ్లపై పడ్డాయి. దీంతో చలవ పందిళ్లకు మంటలు అంటుకోవడం కలకలం రేపింది. 

నిప్పురవ్వలు ఎగిరిపడటంతో చలవపందిళ్లకు పెద్ద ఎత్తున మంటలు రావడంతో వెంటనే కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రెండో అంతస్తు నుంచి నీళ్లు చల్లడంతో మంటలు ఆరిపోయాయి. ఈ సమయంలో అక్కడే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మంటలు ఆరిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement