సీపీఐ సీనియర్‌ నేత వెంకటేశ్వర్లు కన్నుమూత | Ex Senior CPI Leader Venkateswarlu Passed Away | Sakshi
Sakshi News home page

సీపీఐ సీనియర్‌ నేత వెంకటేశ్వర్లు కన్నుమూత

Aug 23 2022 4:41 AM | Updated on Aug 23 2022 4:41 AM

Ex Senior CPI Leader Venkateswarlu Passed Away - Sakshi

వెంకటేశ్వర్లు భౌతికకాయం 

దిల్‌సుఖ్‌నగర్‌: సీపీఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు ఆదివారం రాత్రి మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడు తున్న ఆయన ఆర్‌కేపురం డివిజన్‌ గ్రీన్‌హిల్స్‌కాలనీలో తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లాలో జన్మించిన  వెంకటేశ్వర్లు విద్యార్థి, యువజనోద్యమాల్లో కీలకపాత్రతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు.

సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కొంతకాలంగా క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య సరళ న్యాయమూర్తిగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.

ఆయన మరణవార్త తెలుసుకున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ తదితరులు సోమవారం ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ ఉత్తమ నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. చైత్యన్యపురి కాలనీలోని వీవీనగర్‌లో ఉన్న స్మశానవాటికలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement