పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ అధ్యక్షుడు సుల్తాన్ మహమ్ముద్ చౌదరి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఇస్లామాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మరణించినట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకుడిగా ఉన్న సుల్తాన్ మహమ్ముద్ చౌదరి 2021లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న మహమ్మద్ చౌదరి శనివారం చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతిపట్ల పాక్ అధ్యక్షుడు ఆసిప్ ఆలీ జర్దారీ సంతాపం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్కు ప్రత్యేకంగా అధ్యక్షుడు, ప్రధాన మంత్రి ఉన్నప్పటికీ రక్షణ, విదేశాంగం, కరెన్సీ, కీలక విధానాలు అన్నీ పాకిస్తాన్ నియంత్రణలోనే ఉంటాయి. ఆ దేశంలోని కశ్మీర్ అపైర్స్ అనే మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతంపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.


