గురుకులంలో సీటు రాకుంటే రైతు అయ్యేవాడిని  | DGP Mahender Reddy Visit To Sarvail Gurukulam School | Sakshi
Sakshi News home page

గురుకులంలో సీటు రాకుంటే రైతు అయ్యేవాడిని 

Dec 14 2022 2:19 AM | Updated on Dec 14 2022 11:04 AM

DGP Mahender Reddy Visit To Sarvail Gurukulam School - Sakshi

సంస్థాన్‌ నారాయణపురం: సర్వేల్‌ గురుకుల విద్యాలయంలో సీటు రాకపోయిఉంటే.. సొంత ఊరైన ఖమ్మం జిల్లా కూసుమంచిలో వ్యవసాయం చేసేవాడినని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. చిన్ననాటి స్నేహితులు కూడా వ్యవసాయం చేస్తున్నారని గుర్తు చేసుకున్నారు. తాను ఉద్యోగ విరమణ చేసేలోపు చదువుకున్న పాఠశాలను సందర్శించాలనుకున్న డీజీపీ.. మంగళవారం సాయంత్రం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్‌ గురుకుల విద్యాలయానికి వచ్చారు.

సుమారు రెండు గంటల పాటు ఆయన విద్యాలయంలో గడిపారు. గురుకుల విద్యాలయం ఏర్పాటుకు కారణమైన మద్ది నారాయణరెడ్డి, దివంగత పీఎం పీవీ నర్సింహారావు విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సర్వేల్‌ గురుకులం ఎన్నో నేర్పిందని, విద్యాపరంగా వేసిన పునాది తన జీవితాన్ని మలుపు తిప్పిందని వివరించారు. డీజీపీ స్థాయికి ఎదగడానికి ఈ గురుకులమే కారణమని ఆయన స్పష్టం చేశారు. తన గురువులు నేర్పిన విలువలు ఇప్పటి వరకు దిక్సూచిలా పనిచేస్తున్నా యన్నారు. గురుకులంలో చదివితే ప్రపంచంలో దేన్నైనా జయించవచ్చని చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement