తెలంగాణలో రసవత్తరంగా రాజకీయం.. కవిత లేఖకి ఈడీ రిప్లై!

Delhi Liquor Scam: Ed Accepts Mlc Kavitha Request On Delay Enquiry - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు కారణంగా తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో స్పీడ్‌ పెంచిన ఈడీ విచారణకు హాజరు కావాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. అయితే బిజీ షెడ్యూల్‌ కారణంగా విచారణకు హాజరుకాలేనని ఆమె ఈడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈనెల 15న హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. 

ఈ పరిణామాల మధ్య బుధవారం సాయంత్రం కవిత ఢిల్లీకి పయనమయ్యారు. ఇదిలా ఉండగా కవిత విజ్ఞప్తిని ఈడీ పరిగణలోకి తీసుకుంది. మార్చి 9న కవిత ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నెల 11న కవితను ఈడీ విచారణకు పిలిచే అవకాశముంది.

తెలంగాణ కేబినెట్‌ భేటీ
మరో వైపు గురువారం (మార్చి 9) తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నారన్నారు. వీటితో పాటుగా ఒక వేళ ఈడీ కవితను అరెస్టు చేస్తే ఏం చేయాలనే విషయంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు విషయంగా ఈడీ దూకుడు పెంచుతున్న నేపథ్యంలో తదుపరి కార్యచరణపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. విపక్షాలను నిలువరించేందుకు, నాయకులను బ్లాక్ మెయిల్ చేసేందుకు కేంద్ర వ్యవస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలను బీజేపీ వాడుకుంటోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top