
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దాడి చేశారు. ఆమె బాడీపై చేయి వేసి పక్కకి తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అనంతరం.. నిందితుడిని, అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల ప్రకారం.. ఖమ్మంలోని కల్లూరు ఎన్ఎస్పీలోని ఓ హోటల్ వద్ద తల్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలకు, హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కల్లూరు ఎస్ఐ హరిత.. హోటల్ వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాలకు ఆమె.. సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు.
కాంగ్రెస్ నాయకుడు రాము.. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ హరిత పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. మహిళా అని కూడా చూడకుండా ఆమె భుజాన్ని బలంగా నెట్టివేశారు. దీంతో, అక్కడి ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఎస్ఐపై దాడి చేసిన రాముతో పాటుగా అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
