సీఎం వాహనశ్రేణి మూడుకు, మంత్రుల వాహనాలు రెండుకు తగ్గించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సీఎంతో పాటు ఇతర మంత్రుల వాహనాల సంఖ్యలోనూ తగ్గింపు చేసినట్లు తెలిసింది. సీఎం కాన్వాయ్లో ప్రస్తుతం 9 వాహనాలు ఉండగా ఆ సంఖ్యను మూడుకు తగ్గించినట్లుగా తెలిసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి భద్రతాధికారులు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ ట్రయల్ రన్లో భాగంగా గురువారం తన క్యాంపు ఆఫీసు నుంచి ఎంసీఆర్హెచ్ఆర్డీకి మూడు వాహనాల కాన్వాయ్లోనే వెళ్లారు.
అయితే, దీనిపై తుది నిర్ణయం ఇంకా జరగలేదని, నేడో, రేపో పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. అదేవిధంగా కేబినెట్ మంత్రుల కాన్వాయ్ లోనూ పైలట్ వాహనాలను తొలగించనున్నట్లుగా సమాచారం. దీంతో మంత్రుల వాహనాల సంఖ్య రెండుకు తగ్గనుంది.
ఇరాన్–అమెరికా యుద్ధం నేపథ్యంలో దేశంలోనూ పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించేందుకు కేంద్రం పలు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ కూడా తన కాన్వాయ్ వాహనాలను కుదించుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు భద్రతా వ్యవహారాలను చూసే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.


