సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యలు.. రాబోయే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ప్రసంగించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ రద్దీని నివారించే ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్ నగరానికి నలువైపులా నాలుగు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో సిటీలోనూ ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు వరకు సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం వివరించారు.
మరోవైపు మూసీ అభివృద్ధి ప్రణాళికల అమలుకు తాము ప్రయత్నిస్తుంటే అడ్డు పడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్పై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తయారు చేసిన ప్రణాళికలు తాము అమలు చేస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. అలాగే అప్పటి ప్రభుత్వం మూసీకి ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్ నిర్ణయించిందని పేర్కొన్నారు. నల్లగొండ ప్రజల కష్టాలను చూసైనా మూసీ అభివృద్ధి కి సహాకరించాలని కోరారు.
మూసీ ప్రక్షాళన ఆపండి అని కాకుండా, ముందుకు వెళ్లడానికి సూచనలు ఇవ్వాలన్నారు. ఒక వేళ సూచనలు తనతో పంచుకోవడానికి ఇబ్బందైయితే... శ్రీధర్ బాబు, పొన్నం నేతృత్వంలో కమిటీ వేస్తానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
అలాగే మధుపార్క్ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేస్తున్నారని.. కానీ దీన్ని నాలా నిబంధనల ప్రకారం నిర్మించారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అది బఫర్ జోన్ అయిన నేపథ్యంలో అది ఆ అపార్ట్మెంట్ మధ్యలో నుంచి వెళుతుందని వివరించారు. అయితే మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులకు నష్టం జరగకుండా చూస్తామని, నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఎవ్వరినీ నిరాశ్రయులను చెయ్యం, పునరావాసం కల్పిస్తామంటూ అక్కడి వారికి భరోసా ఇచ్చారు. అలాగే మధుపార్క్ అపార్ట్మెంట్కు తమ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు వచ్చినపుడు తమ అభిప్రాయాలను చెప్పాలని కోరారు.


