ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తాం: సీఎం కేసీఆర్

సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు నానక్రామ్గూడలోని కృష్ణ ఇంటికి చేరుకున్న కేసీఆర్ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మహేష్ బాబును పరామర్శించారు. కుటుంబసభ్యులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సుప్రసిద్ధ నటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని, పార్లమెంట్ సభ్యుడిగా కూడా చేశారని ప్రస్తావించారు. మంచి మిత్రుడుని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధం మర్చిపోలేనిదన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా చాలా సార్లు చూశానని గుర్తు చేసుకున్నారు. కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని వెల్లడించారు. సీఎం వెంట మంత్రులు హరీష్రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: Mahesh Babu-Krishna Death: తండ్రి మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమైన మహేశ్