బండి భగీరథ్‌ కేసులో మరో కీలక పరిణామం | Bandi Bhagirath Case: Victim Records Statement In Medchal Court | Sakshi
Sakshi News home page

బండి భగీరథ్‌ కేసులో మరో కీలక పరిణామం

May 16 2026 8:10 PM | Updated on May 16 2026 8:57 PM

Bandi Bhagirath Case: Victim Records Statement In Medchal Court

సాక్షి, మేడ్చల్‌: బండి భగీరథ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేడ్చల్‌ కోర్టులో బాధితురాలు.. మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ కూడా కోర్టు రికార్డ్‌ చేసింది. ఇప్పటికే రెండుసార్లు స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్‌ చేశారు.

​కేసు తీవ్రత దృష్ట్యా స్వయంగా రంగంలోకి దిగిన న్యాయమూర్తి.. బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. ​బాలిక తల్లిదండ్రుల నుంచి కూడా విడివిడిగా జడ్జి.. స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. బాధిత కుటుంబం నుంచి న్యాయస్థానం కీలక వివరాలు సేకరించింది. మూడోసారి స్టేట్‌మెంట్ ప్రక్రియ.. ​కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. న్యాయమూర్తి సేకరించిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా తదుపరి విచారణ మరింత వేగవంతం కానుంది.

మరోవైపు, భగీరథ్‌ కోసం పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అతని కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలతో ముమ్మరంగా గాలించారు. బాలికను లైంగిక వేధించిన ఆరోపణలతో బండి భగీరథ్‌పై పేట్‌ బషీర్‌బాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు (పోక్సో  చట్టం కింద) నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఆ మరుసటిరోజు నుంచే(ఈ నెల 9న) భగీరథ్‌ ఆచూకీ లేకుండా పోయాడు. కేసు నమోదుకు ముందు చివరిసారిగా హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే.. విచారణకు తమ ఎదుటకు రావాలన్న ప్రత్యేక దర్యాప్తు బృందం పిలుపునకు కూడా అతని నుంచి సరైన స్పందన లేదు. 

ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. తక్షణ ఉపశనమం విషయంలో నిరాశే ఎదురైంది. అయితే గురువారం(మే 21న) ఆ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడనుంది. భగీరథ్‌ కోసం ఐదు బృందాలు.. ఢిల్లీ, కరీంనగర్‌తో పాటు హైదరాబాద్‌ను జల్లెడపట్టారు. ఇవాళ సైబరాబాద్‌ పోలీసులు హైదరాబాద్‌లోని అతని తండ్రి ఇంట్లో సోదాలు కూడా చేశారు. ఈ క్రమంలో ఇవాళ రాత్రి (శనివారం మే 16) షేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో బండి భగీరథ్‌ లొంగిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement