సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. మెహదీపట్నంలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్ను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు శుభమ్ సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 137 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్తో పాటు వోల్వో కారు, ప్యాకింగ్ మెటీరియల్, 9 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్స్ టాస్క్ఫోర్స్, మెహదీపట్నం పోలీసులు పక్కా సమాచారం ఆధారంగా ఆపరేషన్ నిర్వహించారు
నిందితుల్లో శుభమ్ కుమార్ మిశ్రా ఏ1 కాగా, A2 సోహమ్ నాయక్, A3 కలంగి రాజేష్, A4 ముంతున్ కుమార్ మరియు A8 అబ్దుల్ షాబాజ్ బాలానగర్ ప్రాంతానికి చెందినవారు. మిగిలిన వినియోగదారులు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. ప్రధాన నిందితుడు శుభమ్ కుమార్ మిశ్రాకు, అదే ప్రాంతంలో నివసించే బుసా సాయి నిఖిల్ యాదవ్ అలియాస్ సాయి చిన్ననాటి స్నేహితుడు. వీరిద్దరికీ గంజాయి, ఎండీఎంఏ తీసుకునే అలవాటు ఉంది. ఈ క్రమంలో శుభమ్.. సాయి నిఖిల్ వద్ద నుండి ఎండీఎంఏ డ్రగ్ను సేకరించడం ప్రారంభించాడు. కాగా, సాయి నిఖిల్ను ఇటీవల చిలకలగూడ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు.
సాయి నిఖిల్ అరెస్ట్ అయిన తర్వాత కూడా శుభమ్ కుమార్ మిశ్రా ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగించాడు. తన స్నేహితులైన సోహమ్ నాయక్, కలంగి రాజేష్లతో కలిసి కొనసాగించాడు. శుభమ్ వారిద్దరికీ పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేయగా.. వారు దానిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి కస్టమర్లకు విక్రయించేవారు. ఈ డ్రగ్స్ను వినియోగదారులకు చేరవేయడానికి శుభమ్ స్వయంగా వెళ్లడమే కాకుండా, రాపిడో సర్వీసులను ఉపయోగించేవాడు. అలాగే తన అన్న ముంతున్ కుమార్ ద్వారా కూడా డ్రగ్స్ డెలివరీ చేయించేవాడు. ఈ కేసులోని వినియోగదారులు.. నిందితులైన పెడ్లర్ల నుండి గ్రాము ఎండీఎంఏను రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది.


