మరో ముందడుగు
13 కి.మీ దూరం ఈసీఆర్లో భారీ వంతెన మార్గం
రూ. 2,100 కోట్ల పనులు
సీఎం స్టాలిన్ శంకుస్థాపన
ఐటీ బలోపేతానికి టైడల్ పార్కులు
వేలూరు, రాణిపేటలో ఆనకట్టలు, రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు
ప్రగతి పథంలో
సాక్షి, చైన్నె : చైన్నె ఈసీఆర్ మార్గంలో నిత్యం ట్రాఫిక్ రద్దీ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అక్కరై ,నీలాంకరై, కొట్టి వాక్కం, పాల వాక్కం, ఈంజంబాక్కం, ఉత్తండి వరకు వాహనాలు నత్తనడకన సాగాల్సిందే. ఈ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు మోక్షం కల్పించే విధంగా రూ. 2100 కోట్లతో తిరువాన్మీయూరు నుంచి ఈసీఆర్ రోడ్డులోని ఉత్తండి వరకు సుమారు 13.30 కి.మీ వంతెన మార్గం నిర్మాణానికి నిర్ణయించారు. ఇది చైన్నెలో అత్యంత పొడవైన వంతెన జాబితాలోకి చేరనున్నది. దీనిని 17.25 మీటర్ల వెడల్పుతో 4–లేన్ల ఎలివేటెడ్ రోడ్డుగా నిర్మించనున్నారు. తిరువాన్మీయూరు నుంచి కొట్టివాక్కం, పాలవాక్కం, నీలాంకరై, వెట్టువాంకనీ, ఈంజంబాక్కం, షోళింగనల్లూరు, పనయూరు మీదుగా ఉత్తండి వరకు తమిళనాడు రహదారుల శాఖ నేతృత్వంలో ఈ పనులు చేపట్టే దిశగా పునాది రాళ్లను సీఎం స్టాలిన్ వేశారు.
ఐటీ రంగానికి తోడ్పాటు..
ఐటీ రంగాన్ని బలోపేతం చేస్తూ రాష్ట్రంలో మినీ టైడల్ పార్కుల ఏర్పాటు వేగవంతమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 117 కోట్లతో మూడు కొత్త టైడల్ నియో పార్కుల నిర్మాణానికి సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. ఇవి తిరునల్వేలి, విరుదునగర్, ఈరోడ్లలో ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా స్థానిక యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పించనున్నారు. అలాగే, శ్రీపెరంబదూరులో తైవాన్కు చెందిన ఏడీఏటీఏ సెమీకండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. రూ. 931 కోట్లతో ఈ ప్లాంట్ ఏర్పాటు కానున్నది. అలాగే ఐఐటీ మద్రాసు సహకారంతో ఎరోస్ జెన్ ఏఐ తమిళనాడు అభివృద్ధికి రూ.3600 కోట్లతో పూర్తిచేసిన లార్జ్ కల్చరల్ వాయిస్ మోడల్ ప్రాజెక్టును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సందర్భంగా సీఎం ప్రారంభించారు. ఇక, సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, చెక్ డ్యాంల ఆధునీకరణ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో పలు పనులను కూడా సీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందులో రూ. 176 కోట్లతో వేలూరు జిల్లాలోని కోయిల మలై నదిపై ఆనకట్టు నిర్మించనున్నారు. రాణిపేట జిల్లాలో రూ. 200 కోట్లతో పాలారు డ్యాం, రూ.120 కోట్లతో చెంగల్పట్టు జిల్లాలో మదురాంతకం రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచే విధంగా పునర్ నిర్మాణం చేపట్టనున్నారు.
ఆధ్యాత్మికం, వారసత్వ సంరక్షణ
హిందూ మత ధార్మిక శాఖ తరపున రూ. 391 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. ఇందులో రూ. 175 కోట్లతో 16 ఆలయాలలో చేపట్టనున్న 22 కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి. రూ.215 కోట్లో 21 ఆలయాలలో పూర్తిచేసిన 53 పనులు ఉన్నాయి. కొత్తగా చేపట్టనున్న పనులలో పళని మురుగన్ ఆలయం రూ. 53 కోట్లతో భక్తుల కోసం కొత్త వసతి గృహాలు కూడా ఉన్నాయి. పూర్నై పనులలో తిరుచెందూర్ ఆలయం సమీపంలో సముద్ర కోతను అరికట్టడానికి, భక్తుల సౌకర్యాల కోసం రూ. 68 కోట్ల పనులు ఉన్నాయి.
బహుళ అంతస్తుల గృహ సముదాయాలను ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్
ఆడపిల్లల రక్షణలో ఆదర్శం:
రాష్ట్రంలో బాలికల సంరక్షణ, విద్య , జనన సమయంలో లింగ నిష్పత్తిని మెరుగుపరచడంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన తెన్కాసి, కన్యాకుమారి, తిరునెల్వేలి జిల్లాలకు రాష్ట్ర స్థాయి అవార్డులను సచివాలయంలో సీఎం స్టాలిన్ అందజేశారు. లెన్కాసికి రూ. లక్ష నగదు బహుమతిని కలెక్టర్ ఏకే కమల్ కిషోర్, కన్యాకుమారికి రూ. 75 వేలు జిల్లా కలెక్టర్ అళగు మీనా, తిరునల్వేలికి రూ. 50 వేలు జిల్లా కలెక్టర్ ఆర్ సుకుమార్ అందుకున్నారు. ఈ కార్యక్రమాలలో మంత్రులు ఏవీ వేలు, గీతా జీవన్, స్వామినాధన్, టీఆర్బీ రాజా, ఎంఆర్కే పన్నీరు సెల్వం, సీవీ గణేశన్, అన్బిల్ మహేశ్ పొయ్యా మోళి, శేఖర్బాబు, సీఎస్ మురుగానందం, ఐఐటీ డైరెక్టర్ వీ కామ కోటితో పాటూ ఆయా శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
స్మారక చిహ్నాలు..
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (తిరుత్తణి), తమిళ నవలా రచయిత వేదనాయకం పిళ్లై, స్వాతంత్య్ర సమర యోదుడు నాడి ముత్తు పిళ్లై, స్వామి నాగప్పన్ వంటి మహనీయుల విగ్రహాలను ఈ సందర్భంగా సీఎం వీడియో కాన్ఫరన్స్ ద్వారా ఆవిష్కరించారు. ఇక, వేలూరు జిల్లాలోని పెరుముకై గ్రామంలో రూ. 45 కోట్లు తో 250 పడకలతో కలైంజ్ఞర్ శత జయంతి స్మారక హాస్టల్ భవనం, రూ. 99.76 కోట్ల వ్యయంతో సైదాపేట దాదందర్ నగర్ 190 అపార్ట్మెంట్లతో ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయంలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. అలాగే, కడలూరులో రూ. 98.26 కోట్ల వ్యయంతో నిర్మించనునున్న నాలెడ్జ్ బిల్డింగ్కి అంజలై అమ్మాల్ పేరు పెట్టడమే కాకుండా, నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. 35 జిల్లాల్లోని 217 ప్రభుత్వ పాఠశాలల్లో 296.62 కోట్ల రూపాయలు. నిర్మించిన 1232 తరగతి గదుల భవనాలు, 9 ప్రయోగశాలలు తదితర భవనాలను ప్రారంభించారు.


