కామ్రేడ్ నల్లకన్నుకు ఘన నివాళి
సాక్షి, చైన్నె : జీవితాంత పోరాటాల ప్రయాణం సాగించి శాశ్వత నిద్రలోకి వెళ్లిన సీపీఐ సీనియర్ నేత నల్లకన్ను (101) పార్తీవ దేహానికి వీర వందనం...వీర నివాళి అర్పించిన తర్వాత గురువారం తుది వీడ్కోలు పలికారు. గాల్లో 72 తుపాకీ తూటాలు పేల్చి అధికార లాంఛనాలతో చైన్నె వైద్యకళాశాలకు ఆయన దేహాన్ని అప్పగించారు. వివరాలు.. సీపీఐ సీనియర్ నేత నల్లకన్ను అనారోగ్యంతో బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన పార్తీవ దేహానికి ఎంబామింగ్ చేసిన అనంతరం సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యాలయానికి తరలించారు. టీ నగర్ సీపీఐ కార్యాలయం వైపుగా రాత్రంతా కమ్యూనిస్టులు తరలి వచ్చి నివాళులర్పించారు. వివిధ జిల్లాల నుంచి గురువారం ఉదయం బృందాలు బృందాలుగా తరలి వచ్చిన తమ వీర వందనం, వీర నివాళులను అర్పించారు. పోరాటాలతో అలిసి శాశ్వత విశ్రాంతిలోకి వెళ్లిన నల్లకన్నును కడసారిగా చూసుకునేందుకు జన సందోహం సైతం పోటెత్తారు. టీవీకే నేత విజయ్, సినీ నటులు రజనీకాంత్, సత్యరాజ్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, రచయిత వైర ముత్తు తదితరులు సైతం పార్తీవ దేహం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆయన సేవలను, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఐ జాతీయ నేత రాజ, రాష్ట్ర నేత వీర పాండియన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్,మైనారిటీ నేతలు జవహిరుల్లా తదితరులు, మాజీ సీఎం పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే తరపున మాజీ మంత్రి జయకుమార్, టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై... అంటూ పార్టీలకు అతీతంగా నేతలందరూ తరలి వచ్చిన నివాళులర్పించారు.
అధికారిక లాంఛనాలతో..
గురువారం సాయంత్రం సీపీఐ కార్యాలయం ఆవరనలో నల్లకన్ను పార్తీవ దేహానికి వీర నివాళులు, వీర వందనం సమర్పించారు. అంతే కాదు, రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. గాల్లో 72 తుపాకీ తూటాలు పేల్చి ఆయనకు గౌరవాన్ని కల్పించారు. వీడ్కొలు కార్యక్రమంలో సీఎం స్టాలిన్ ఉద్వేగానికి లోనవుతూ, వీర వందనం..వీర నివాళి అంటూ నల్లకన్ను పార్తీవదేహం వద్ద నినాదాలు చేశారు. ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, డీఎంకే నేతలు పొన్ముడి, ఏవీ వేలు, ఎ. రాజ, సీపీఎం, తదితర పార్టీల నేతలు అంతిమ వీడ్కొలు కార్యక్రమానికి హజరయ్యారు.అనంతరం ఆయన పార్తీవ దేహాన్ని ఊరేగింపుగా చైన్నె మెడికల్ కళాశాలకు తీసుకెళ్లారు. దారి పొడవున కామ్రేడ్కు వీడ్కొలు పలుకుతూ కమ్యూనిస్టులు, మార్కిస్టులు, స్థానిక ప్రజలు అంజలి ఘటించారు. నల్లకన్ను కోరిక మేరకు విద్యార్థుల పరిశోధన నిమిత్తం ఆయన పార్తీవ దేహాన్ని చైన్నె వైద్య కళాశాలకు అందజేశారు. పార్థీవ దేహం ఊరేగింపు సుమారు రెండు గంటల పాటూ సాగింది. రాజీవ్గాంధీ జీహెచ్ వద్ద వామపక్ష నేతలు, ఇతర పార్టీలకు చెందిన నేతల సమక్షంలో వైద్య కళాశాల నల్లకన్ను భౌతిక కాయాన్ని అందజేశారు.
అధికార లాంఛనాలతో వీడ్కోలు
కామ్రేడ్ నల్లకన్నుకు ఘన నివాళి


