కోదాడ : ‘నేను పదవి విరమణ చేశాను.. కానీ పెదవి విరమణ చేయలేదు.. వయస్సు సహకరించినంత వరకు ప్రజల మధ్య ఉండడానికి ఇష్టపడతాను.. ప్రజలకు ఉపయోగపడే నాలుగు మాటలు చెప్పాలని ఇక్కడకు వచ్చాను’ అని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. కోదాడలో కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన కల్యాణ మండపానికి గురువారం ఆయన ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మంచి పనులు చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కులం ఉండాలి.. కానీ కులతత్వం ఉండవద్దని హితువు చెప్పారు. తోటి వారి పట్ల సోదరభావం కలిగి ఉండాలని.. ప్రకృతిని కాపాడుకోవాలన్నారు. మానవ తప్పిదాల వల్ల ప్రస్తుతం ప్రకృతి ప్రకోపిస్తుందన్నారు. తాను న్యాయవాదిని కావాలకున్నానని.. ఎమర్జెన్సీ వల్ల రాజకీయాల్లోకి రావాల్సివచ్చిందన్నారు. రాజకీయ నాయకులు తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థచైర్మన్ రాయల నాగేశ్వరరావు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, పెదనాటి వెంకటేశ్వరరావు, బొడ్డు రవిశంకర్, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ మంత్రి వీరేపల్లి లక్ష్మీనారాయణరావు, రఘురాం, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమకుమారి, ముత్తవరపు పాండురంగారావు, వేమూరి సురేష్, పోటు రంగారావు, మాధవరావు, కనగాల నాగేశ్వరరావు, ప్రసాద్, రత్నాకర్రావు పాల్గొన్నారు.
ఫ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు


