24వ తేదీన డ్రా | - | Sakshi
Sakshi News home page

24వ తేదీన డ్రా

Jun 20 2025 5:25 AM | Updated on Jun 20 2025 5:25 AM

24వ త

24వ తేదీన డ్రా

భానుపురి (సూర్యాపేట) :2025 – 26 విద్యా సంవత్సరానికి గాను జిల్లా పరిధిలోని ఎస్సీ విద్యార్థులకు బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం కింద ఒకటవ తరగతి డే స్కాలర్‌, ఐదవ తరగతి రెసిడెన్షియల్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 24వ తేదీన డ్రా తీయనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి కె. దయానందరాణి తెలిపారు. ఈమేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 24న ఉదయం 11 గంటలకు కలెక్టర్‌ కార్యాలయంలోని మీటింగ్‌ హాల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.

దరఖాస్తుల ఆహ్వానం

భానుపురి (సూర్యాపేట) : జపాన్‌, సౌత్‌ కొరియా, న్యూజిలాండ్‌, సింగపూర్‌ దేశాల్లో చదువుకునేందుకు ఆసక్తి ఉన్న ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనుల పిల్లలు సీఎం ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా మైనార్టీ అధికారి జగదీశ్వర్‌ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో సూచించారు. జనవరి 2025 నుంచి జూన్‌ 30వ తేదీ మధ్యకాలంలో అడ్మిషన్‌ తీసుకున్న అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, ధ్రువపత్రాలను జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలని, ఈ పథకం కింద ఎంపికై న ప్రతి విద్యార్థికి స్కాలర్‌షిప్‌ కింద రెండు విడతల్లో రూ.20 లక్షలు, విమాన ప్రయాణం చార్జీలు రూ.60 వేలు చెల్లించనున్నట్లు వివరించారు. ఈనెల 30తేదీ వరకు దరఖాస్తుచేసుకోవచ్చని సూచించారు.

మట్టపల్లిలో నిత్యకల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం నిర్వహించారు. కల్యాణవేడుకల భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం , మధుఫర్కపూజ, మాంగళధారణ, తలంబ్రాలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం గరుడవాహనంపై శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్‌, భక్తులు పాల్గొన్నారు.

యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. భక్తులు వివిధ పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

బీసీ రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలు నిర్వహించాలి

మునగాల : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పొనుగోటి రంగా కోరారు. గురువారం మునగాల మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో మొగిలిచెర్ల సత్యనారాయణ, రావులపెంట రాజబాబు, గండు నారాయణ, మేకపోతుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

24వ తేదీన డ్రా1
1/1

24వ తేదీన డ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement