
20 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం
నడిగూడెం : వచ్చే మూడున్నరేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. మోతె మండలం విభళాపురంలో పైలట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డితో కలిసి ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం నిర్వహించిన సమావేశంతో పాటు విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 3.70లక్షల మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు తీసుకొని, అధికారాన్ని దుర్వినియోగం చేసి, నేడు సోషల్ మీడియాలో ఇందిరమ్మ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్రెడ్డి, కేబినెట్ మంత్రుల సహకారంతో రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధిని గాడిలో పెడుతున్నామన్నారు. వచ్చే ఏ ఎన్నికలైనా విజయం ఇందిరమ్మ ప్రభుత్వందేనని ధీమా వ్యక్తం చేశారు.
ఆగస్టు15నాటికి భూ సమస్యలన్నీ పరిష్కారం
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరుగెడుతున్నాయని మంత్రి అన్నారు. విడతల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. గత పాలకులు పదేళ్లు పాలించి ఒక్క ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. భూ భారతిచట్టం ద్వారా వచ్చే ఆగస్టు 15 నాటికి భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ప్రజల సంక్షేమం కోసం ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రైతు భరోసా ఎకరానికి రూ.12 వేలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సేవలు, ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల మంజూరు ఇలా పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి మాట్లాడుతూ విభళాపురం గ్రామాన్ని పైలట్ప్రాజెక్టు కింద ఎంపిక చేసి తొలి విడత 146 ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టిన 74 మంది లబ్ధిదారులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణు మాధవరావు, గృహనిర్మాణ శాఖ పీడీ ధర్మారెడ్డి, తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీఓ ఆంజనేయులు, గృహనిర్మాణ శాఖ ఏఈ నాగరత్మమ్మ పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
ఫ విభళాపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన

20 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం