
డుమ్మా కొట్టడం కుదరదిక!
ఉద్యోగుల వివరాల సేకరణ..
జిల్లాలోని 23 మండలాల్లో మండల పరిషత్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో సుమారు 12 నుంచి 15 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాగే జిల్లా పరిషత్ కార్యాలయంలో సుమారు 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతంలో వేలిముద్రల హాజరు విధానం కార్యాలయాల్లో సరిగ్గా అమలు కాలేదు. సంబంధించిన పరికరాల మరమ్మతుల కారణంగా కొద్దిరోజుల అనంతరం వాటిని మూలన పడేశారు. ఫేస్ రికగ్నైజేషన్ హాజరు నమోదుకు ఉద్యోగులు, అధికారుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఉద్యోగుల ఆధార్ కార్డులోని వివరాలు సేకరిస్తున్నారు. విధులకు హాజరు.. ఇంటికి వెళ్లే సమయాల్లో రెండుసార్లు ఫేస్ రికగ్నైజేషన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. హాజరు యంత్రానికి జీపీఎస్ను అనుసంధానం చేయనున్నారు. హాజరు నమోదు వివరాలు రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తారు.
నాగారం : జిల్లా, మండల పరిషత్ అధికారులు, ఉద్యోగులకు ఇక నుంచి ఫేస్ రికగ్నైజేషన్ హాజరు అమలుకానుంది. ప్రస్తుతం రిజిస్టర్లో పేర్లు రాస్తుండటంతో కొందరు విధులకు హాజరు కాకపోయినా నమోదు చేసుకుంటున్నారు. ఆలస్యమైనా సమయానికి వచ్చినట్లు హాజరు వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ అవకతవకలను అరికట్టడానికే ఈ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఉద్యోగుల సమయపాలన, హాజరు సమయాలు పక్కాగా ఉండేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ విధానం అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని 23 మండలాలు, ఒక జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, అధికారులు తప్పనిసరిగా ఫేస్ రికగ్నైజేషన్ హాజరు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం అమలుకు అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది.
పూర్తి స్థాయి సేవలు..
ఈ విధానంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు పక్కాగా అమలయ్యే అవకాశం ఉంటుంది. సంక్షేమ పథకాల అమలులో మండల స్థాయి అధికారులు కీలకపాత్ర పోషిస్తారు. గ్రామం నుంచి మండల స్థాయి వరకు అధికారుల పర్యవేక్షణ, సిబ్బంది పనితీరు సక్రమంగా ఉంటే ఫలాలు ప్రజలకు అందుతాయి. మండల పరిధిలోని ప్రభుత్వ పంచాయతీరాజ్, గృహనిర్మాణ, ఉపాధిహామీ శాఖల అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓల పర్యవేక్షణ కీలకం. సాంకేతిక సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ల హాజరు కూడా ప్రభావం చూపుతుంది. కార్యాలయాల్లో వీరి సమయపాలన, హాజరుతో పథకాలు పరుగులు పెడతాయి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా పర్యవేక్షణ ఉండనుంది.
ఫ జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల ఉద్యోగులకు ఫేస్ రికగ్నైజేషన్ హాజరు
ఫ సిబ్బంది వివరాలు సేకరించే పనిలో ఉన్నతాధికారులు
ఫ రోజూ రెండు పర్యాయాలు హాజరు నమోదు
ఫ హాజరు మిషన్కు జీపీఎస్ అనుసంధానం
ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి
జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీనిని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ కొత్త విధానంతో ఉద్యోగుల సమయపాలన పక్కాగా ఉంటుంది.
– కె.యాదగిరి, జిల్లా పంచాయతీ అధికారి