
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదోడి సొంత ఇంటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా ఇస్తుందని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. బుధవారం కలెక్టర్ తన చాంబర్లో ఎస్పీ నర్సింహ తో కలిసి ఇసుక విధానంపై నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్ట విరుద్ధంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్లు జారీ చేసిన వేబిల్లులో సమయం, వాహనం నంబర్, ఫోన్ నంబర్, ఎక్కడ నుంచి ఎక్కడికి ఇసుక తరలిస్తున్నారో అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాతనే అనుమతి ఇవ్వాలన్నారు. ప్రతి తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయంలో ఒక అధికారిని నియమించి ప్రతి వారం ఎన్ని అనుమతులు ఇచ్చారో సీ సెక్షన్కు నివేదిక సమర్పించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు, నీటి పారుదల శాఖకు మాత్రమే ఇసుక ఉచితంగా ఇస్తామని తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇతర జిల్లాలకు ఇసుక తరలిస్తే వాహనాలను బ్లాక్ చేయాలని తహసీల్దార్లకు సూచించారు. మొదటి సారి అక్రమ రవాణాలో వాహనం పట్టుపడితే కలెక్టర్ అనుమతితో రూ.5వేల జరిమానా, రూ.లక్షా బైండొవర్ విధించి వదిలి పెట్టాలని, రెండవసారి పట్టుపడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ అక్రమ రవాణాలో ఏమైనా వాహనాలు పట్టుపడితే గతంలో ఉన్న కేసుల వివరాలతో తహసీల్దార్లకు అప్పగించాలని సూచించారు. జాజిరెడ్డిగూడెం ఇసుక రీచ్ నుంచి మాత్రమే ఇరిగేషన్ శాఖకు అనుమతి ఉందన్నారు. సమావేశంలో ఆర్డీఓ వేణుమాధవరావు, మైనింగ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్