శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పాత్రునివలస గ్రామంలో గల దుర్గమ్మ ఆలయంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత చోరీ జరిగింది. రూరల్ పోలీసులు అందించిన వివరాలు మేరకు.. గ్రామస్తులు నిత్యం కొలిచే అమ్మవారి ఆలయంలోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి తులం బంగారంతో పాటు రెండున్నర కిలోల వెండిని తస్కరించారు. గురువారం ఉదయం గ్రామంలో గల అర్చకుడు తలుపులు తెరిచిచూడగా ప్రధాన ఆలయం ముఖద్వారం వద్ద తాళాలు పగలకొట్టి ఉండడంతో దొంగతనం జరిగిందని గ్రహించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. టౌన్ సీఐ పైడపునాయుడు ఆదేశాల మేరకు క్లూస్టీంతో పాటు వారు డాగ్ స్క్వాడ్ను తీసుకొని వచ్చి తనిఖీలు చేపట్టారు. స్థానికంగా గల నూతిలో సీసీ కెమెరాలు బద్దలుకొట్టి పడేసినట్లు పోలీసులు గుర్తించారు. రూరల్ ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


