టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం నిర్వహిస్తున్న 10వ సిల్వర్ జూబ్లీ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరుకానున్నారని కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమాలు మొదలవుతాయని పేర్కొన్నారు.
గురుకులాల్లో మెరుగైన ఫలితాల సాధనకు కృషి
కంచిలి: జిల్లాలో గురుకుల పాఠశాల, కళాశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు వచ్చేందుకు ఐక్యంగా కృషి చేస్తున్నట్లు జిల్లా గురుకుల విద్యాలయాల సమన్వయకర్త(డీసీఓ) వై.యశోదలక్ష్మి అన్నారు. కంచిలి గురుకులాన్ని మంగళవారం సదర్శించి సమగ్ర తనిఖీ చేపట్టారు. విద్యాప్రమాణాలు, వసతులపై సమీక్ష నిర్వహించారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు తగ్గడంపై ఆరా తీశారు. ఈ విద్యా సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు తగ్గకుండా శతశాతం ఉత్తీర్ణత సాధించేలా పకడ్బందీగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉపాధ్యాయులు, అధ్యాపకులను ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్.వెంకటరమణ, గురుకుల ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
నేత్రాలపై శ్రద్ధ అవసరం
శ్రీకాకుళం అర్బన్: ‘జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు‘ సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలికలు) ఆవరణలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ‘కంటి ఆరోగ్యం–నేత్రదానం‘ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎం.కృష్ణవేణి మాట్లాడుతూ జాతీయ అంధత్వ, దృష్టిలోప నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులంతా కంటి ఆరోగ్యం–నేత్రదానం పై అవగాహన కలిగి గ్రామాల్లో ఈ విషయం అవగాహన కల్పించాలన్నారు. కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆప్తాల్మిక్ అధికారి ఎంఆర్కె దాస్, రోటరీ క్లబ్ శ్రీకాకుళం ప్రతినిధులు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
యాజమాన్య పద్ధతులో అధిక దిగుబడులు
జి.సిగడాం(పొందూరు): రైతులు ఆధునిక పద్దతిలో వ్యవసాయం సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ చిట్టిబాబు, డాక్టర్ స్వాతి అన్నారు. మంగళవారం బాణాం రైతుసేవా కేంద్రం ఆధ్వర్యంలో వరిసాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎప్పుడూ మొక్కజొన్న, వరి పంటలే కాకుండా వేరుశనగ, ఇతర ఆరుతడి పంటలు సాగు చేస్తే మంచి రాబడులు వస్తాయన్నారు. వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటే పంటలపై మరింత అవగాహన కలుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్సీ ఏవో రేణుకాసాయి, మండల వ్యవసాయాధికారి శ్రీనివాసుబాబు, ఏఈఓ ప్రవీణ్కుమార్, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, రైతులు పాల్గొన్నారు.


