● ఎమ్మెల్సీ నర్తు రామారావు మండిపాటు
కవిటి: రాష్ట్రంలోని బీసీ కులాల గొంతును సీఎం చంద్రబాబు నొక్కేస్తున్నారని ఎమ్మెల్సీ, యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు నర్తు రామారావు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో లిక్కర్ పాలసీ పారదర్శకంగా నడిచిందని గుర్తు చేశారు. అక్రమాలే లేని మద్యం విధానంలో కుంభ కోణానికి ఆస్కారం ఎక్కడుంటుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పని చేసిన మంత్రులను టార్గెట్ చేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతూ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా కోర్టులో నిరూపణ చేస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయక, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని దుమ్మెత్తిపోశారు. రానున్న రోజుల్లో బీసీలు కూటమి ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో యువ నాయకుడు నర్తు శివాజీ యాదవ్ తదితరులు ఉన్నారు.


