● ఆత్మహత్యకు సిద్ధమైన బొద్దూరు వాసి
● సకాలంలో స్పందించి రక్షించిన పొందూరు ఎస్ఐ రాజేష్
జి.సిగడాం/పొందూరు : కుటుంబ కలహాల కారణంగా రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని పొందూరు ఎస్ఐ జి.రాజేష్ చాకచక్యంగా కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం బొద్దూరు గ్రామానికి చెందిన గేదెల రవి (50) గురువారం రాత్రి కుటుంబ కలహాలు నేపథ్యంలో పొందూరు–జి.సిగడాం గ్రామాల మధ్య ఉన్న రైల్వే ట్రాక్పైకి వచ్చి ఆత్మహత్యకు సిద్ధమయ్యారు. ఇంతలో రవి కుమార్తె విషయాన్ని రాజాం సీఐకి ఫోన్ ద్వారా తెలియజేసింది. ఆయన అప్రమత్తమై రవి ఫోన్ లోకేషన్ ఆధారంగా పొందూరు ఎస్ఐ జి.రాజేష్కు సమాచారం అందించారు. ఎస్ఐ హుటాహుటిన పొందూరు–రాజాం ప్రధాన రహదారిలో ఉన్న వంతెన కింద రైల్వే ట్రాక్పైకి వెళ్లి రవిని రక్షించారు. అప్పటికే రవి చెయ్యి రైలు కింద పెట్టడంతో తీవ్ర గాయమైంది. అనంతరం రాజాం స్టేషన్కు అప్పగించారు. వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఎస్ఐను రవి కుమార్తెతో పాటు గ్రామస్తులు అభినందించారు.


