శ్రీకాకుళం పాతబస్టాండ్ : సెప్టెంబరు 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు ఉచితంగా, త్వరితగతిన, స్నేహపూర్వకంగా న్యాయం అందించి సమాజంలో శాంతి సామరస్యాలు నెలకొల్పాలని, ఇందులో న్యాయవాదులు క్రియాశీలక పాత్ర పోషించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా బార్ అసోసియేషన్ హాలులో న్యాయవాదులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకుంటే కోర్టు ఫీజు పూర్తిగా తిరిగి వస్తుందని, తీర్పుపై ఎలాంటి అప్పీల్ ఉండదని స్పష్టం చేశారు. ఇరుపక్షాల సమ్మతితో రాజీ కుదరడం వల్ల శతృత్వం శాశ్వతంగా దూరమవుతుందన్నారు. పెండింగ్ కేసుల భారం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రికవరీ, చెక్కు బౌన్స్, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్, కుటుంబ కోర్టు, కార్మిక వివాదాలు, విద్యుత్, నీటి బిల్లులు, సివిల్, రాజీకి వీలైన క్రిమినల్, ప్రీ–లిటిగేషన్ కేసులను ఇందులో పరిష్కరించుకోవచ్చని సూచించారు. క్లయింట్లతో మాట్లాడి రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి సెప్టెంబరు 12 నాటి లోక్ అదాలత్కు పంపాలనన్నారు. జిల్లా న్యాయమూర్తి మార్గదర్శకత్వంలో శ్రీకాకుళం జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేలా రికార్డు స్థాయిలో కేసులు పరిష్కరించాలని, ప్రతి బార్ అసోసియేషన్, న్యాయవాది ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. తమ వంతు బాధ్యతగా వ్యవహరించి క్లయింట్లను ఒప్పించాలని రెండో అదనపు జిల్లా జడ్జి బి.సాధుబాబు, మూడవ అదనపు జిల్లా జడ్జి వివేక్ ఆనంద్ శ్రీనివాస్, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఎన్.నాగ ప్రసన్న భారతి సూచించారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రాజారావు, ప్రదాన కార్యదిర్శి సూర్యనారాయణ, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


