మియాపూర్: అపార్ట్మెంట్ ఐదో అంతస్తు టెర్రస్ పై నుంచి కిందపడి ఓ యువతీ మృతి చెందిన విషాద ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శిరీషారెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళానికి చెందిన బుద్ధ వెంకటప్రతాప్రెడ్డి, ప్రశాంతి దంపతులకు ఓ కుమార్తె బుద్ధ శ్రీ ప్రాణమ్య(20), ఓ కుమారుడు ఉన్నారు. వెంకటప్రతాప్రెడ్డి కుమారునితో పాటు అమెరికాలో ఉంటున్నారు. ప్రశాంతి కూతురు ప్రాణమ్యతో కలిసి అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. మియాపూర్ మయూరీనగర్ కాలనీలోని బొమ్మరిల్లు అపార్ట్మెంట్లో తల్లిదండ్రుల ఇంటిలో ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ప్రాణమ్య వారు ఉంటున్న అపార్ట్మెంట్ ఐదో అంతస్తు టెర్రస్ పైకి ఫోన్ మాట్లాడేందుకు వెళ్లింది. టెర్రస్ గోడకు అనుకొని మాట్లాడుతుండగా అదుపుతప్పి గ్రౌండ్ ఫ్లోర్లో పడి పోయింది. అదే సమయంలో ప్రాణమ్య తల్లి ప్రశాంతి బయటికి వెళ్లి అపార్ట్మెంట్కు చేరుకుంది. అక్కడ ఉన్న వాచ్మెన్ చూసి మీ కూతురు భవనం పై నుంచి కిందపడిందని సమాచారం ఇవ్వడంతో దగ్గరకు వెళ్లి చూడగా కూతురు ప్రాణమ్య తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉంది. స్థానికుల సహాయంతో దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి ప్రాణమ్య మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలి ప్రాణమ్య ఆన్లైన్లో డిగ్రీ చదువుతోంది. బొమ్మరిల్లు అపార్ట్మెంట్ దగ్గరలోనే ఓ అపార్ట్మెంట్లో ప్రశాంతి సొంత ఫ్లాట్ ఉంది. రెండు, మూడు రోజుల్లో ఆ ఇంటికి వెళ్లేందుకు క్లీనింగ్ ఇతర ఏర్పాట్లను చేసుకున్నారని సమాచారం. ప్రాణమ్య భవనం నుంచి కింద పడిపోవడానికి ముందు తల్లితో మాట్లాడింది. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకొని ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి తల్లి ప్రశాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


