శ్రీకాకుళం కల్చరల్ : ‘తెలుగు సాహిత్యరంగానికి నాయకత్వం వహించే స్థాయిలో కళింగాంధ్ర ఉంది. దళిత కవితాత్వికతలో చాలా వెలితి కన్పించేది. కలమట దాసు బాబు తాజాగా రచించిన ‘ఈర్నం’ చదివిన తర్వాత అది భర్తీ చేసే తరం ప్రారంభమైందన్న సంతృప్తి కలిగింది’ అని ప్రముఖ కవి, విమర్శకుడు గుంటూరు లక్ష్మీనరసయ్య అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు సమావేశ మందిరంలో శ్రీకాకుళ సాహితీ, సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో ఈర్నం కవితా సంకలనం ఆవిష్కరించారు. పుస్తక ప్రచురణ బాధ్యత స్వీకరించిన చిగురుపల్లి చంద్రకళ స్మారక వేదిక చైర్మన్ సీహెచ్.ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు సంకలనాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఈ కవితా సంపుటిపై ప్రముఖ కవి బాల సుధాకర్ ‘దళిత కళింగం’ పేరుతో రచించిన పరిశీలనాత్మక వ్యాసాన్ని ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో దాసరి రామచంద్రరావు (కథా నిలయం), చీకటి దివాకర్, కె.శ్రీనివాస్ (సాహితీ స్రవంతి), అల్లాడ లక్ష్మి (ఐద్వా), నల్లి ధర్మారావు, సిరికి స్వామినాయుడు (అరసం), పక్కి రవీంద్రనాథ్ (స్నేహ కళా సాహితి, పార్వతీపురం), పి.వి.నరసింహులు( విశ్వసాహితి, ఆమదాలవలస), అల్టి మోహనరావు (రాజాం రచయితల వేదిక) తదితరులు పాల్గొన్నారు.


