లక్షలు వ్యయం..లక్ష్యం శూన్యం
స్వచ్ఛమైన గాలికోసం కాసేపు సేదతీరుదామంటే సరైన పార్కులు లేవు. కొన్నిచోట్ల ఉన్నా అందులోకి అడుగు పెట్టలేని పరిస్థితి. తుప్పుపట్టిన పరికరాలు, విరిగిపోయిన ఆట వస్తువులు, తుప్పలతో నిండిన పరిసరాలు.. ఇవీ జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని పార్కుల పరిస్థితి. శ్రీకాకుళంలో ఇటీవల అభివృద్ధి చేసిన ఒకటీ అరా పార్కుల తప్పితే మిగిలిన పురపాలికలైన ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాసలలో ఉద్యానవనాల పరిస్థితి ఘోరంగా ఉంది. అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు పంపించడం తప్ప కార్యాచరణకు మాత్రం నోచుకోవడం లేదు. మున్సిపాలిటీల పరిధిలోని పార్కుల పరిస్థితిపై ‘సాక్షి’ ఫోకస్..
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదం కరువవుతోంది. రైల్వేట్రాక్ను ఆనుకుని బి.ఆర్.నగర్లో ఉన్న అమరావతి పార్కు అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. మొద ట్లో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పార్కుపై ప్రత్యేక దృష్టి సారించడంతో పట్టణ ప్రజలు కాసేపు సేదతీరేవారు. తర్వాత పార్కును గాలికొదిలేయడంతో తుప్పలు, పాముల పుట్టలతో నిండిపోయింది. లక్ష్ముడిపేట, వెంకయ్య పేట గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన మినీ పార్కు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. ఆమదాలవలస మోనింగివారి వీధిలోని రామలింగేశ్వర పుష్కరిణీ పార్కు, భగత్సింగ్ కార్ రేస్ పార్కులు, నెహ్రూ చిల్డ్రన్ పార్కులు నిర్వహణ లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.
పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో పార్కు లు అధ్వానంగా మారాయి. పలాసలో నెహ్రూ పార్కు(ముత్యాలమ్మ కోనేరు), భద్రం కోనేరు, కాశీబుగ్గలోని రాధాకాంత చెరువు పార్కులకు రూ.లక్ష లు వ్యయం చేశారు. ప్రస్తుతం ఒక్క నెహ్రూ పార్కు అందుబాటులో ఉండగా.. అందులో కూడా తగిన సదుపాయాలు లేవు. ఈ ఏడాది నెహ్రూ పార్కులో ట్రాక్, రివిట్మెంటు, డీపింగ్, లైటింగ్ తదితర పనులు కోసం సుమారు రూ.50 లక్షలు వెచ్చించా రు. అయినా తగిన ఫలితం కనిపించడం లేదు. కొత్తగా మొక్కలు వేసినా తగిన రక్షణ లేక పోవడంతో ఎండిపోతున్నాయి. సరైన ప్రహరీ లేకపోవడంతో పశువులు వచ్చేస్తున్నాయి.


