శ్రీకాకుళం: కార్పొరేషన్ అధికారులకు అసలు నగరంలో ఎన్ని పార్కులు ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. గాంధీ పార్కు, కార్గిల్ విక్టరీ పార్కు, రివర్ వ్యూ పార్కు, శాంతినగర్ కాలనీ పార్కు, డైమండ్ పార్క్, అఫీషియల్ కాలనీలో ఉన్న పార్కుల మాత్రమే కాస్త పచ్చదనంతో కనిపిస్తున్నాయి. హడ్కో కాలనీ, శాంతినగర్ కాలనీ, జానకిరామ నగర్ కాలనీ తదితర పార్కు పిచ్చి మొక్కలు, మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రిజర్వ్ స్థలాలను కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా ప్రభాకర్ నగర కాలనీ పార్కును చెప్పవచ్చు. ఇక్కడి రిజర్వ్ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేసేందుకు 15 ఏళ్ల క్రితం నగరపాలక సంస్థ అధికారులు ప్రహరీ నిర్మించగా, ఓ సంస్థ వచ్చి దీనిని తమకు హోమియో క్లినిక్ నిర్వహించేందుకు లీజు పద్ధతి పై కేటాయించారని చెప్పడంతో ఆ సంస్థకు అప్పగించేశారు. ఏఎస్ఎన్ కాలనీ పార్కుదీ అదే పరిస్థితి. అందులో ఏకంగా వాటర్ ట్యాంక్ నిర్మించేశారు. రామకృష్ణ నగర్ కాలనీలో రిజర్్వ స్థలాన్ని ఓ ప్రైవేటు వ్యక్తి తమదని పోరాటం చేయగా, నగరపాలక సంస్థ న్యాయ పోరాటం చేసి దానిని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అక్కడ నగరంలో పట్టుబడిన పశువులను తీసుకువెళ్లి ఉంచుతున్నారు.
కాలనీల్లో చాలాచోట్ల రిజర్వ్ స్థలాలు ఉన్నప్పటికీ పార్కులుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. పదేపదే అభివృద్ధి చెందిన పార్కులపైనే నిధులు వెచ్చిస్తున్నారు తప్ప అసలు అభివృద్ధి జరగని పార్కులపై దృష్టి సారించడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అసలు పార్కులు, రిజర్వ్ స్థలాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎంత మేర అభివృద్ధి పనులు చేపట్టాలనే విషయమై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.


