అరసవల్లి : అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. కేశఖండన శాలలో తలనీలాలను సమర్పించారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తుల కోసం ఏఈఓ గడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పలు ఏర్పాట్లు చేశారు. ఎండ నుంచి రక్షణగా చర్యలు చేపట్టినప్పటికీ..వాతావరణం చల్లబడటంతో భక్తులు ప్రశాంతంగా దర్శనాలు చేసుకున్నారు. అన్నదాన ప్రసాదం కోసం భక్తులు ఆసక్తి చూపినప్పటికీ కొందరికి ప్రసాదం దొరక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో రూ.300 చెల్లించిన భక్తులకు అంతరాలయ దర్శనం చేయించి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు. పలువురు ప్రముఖులు ఆదిత్యున్ని దర్శించుకున్నారు.
సింహాద్రి అప్పన్న సన్నిధిలో కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: సింహాచలంలోని వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని ఆదివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆలయ సంప్రదాయం మేరకు స్వాగతం పలికారు. అనంతరం క్షేత్ర మహిమాన్వితానికి ప్రతీకగా భావించే కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. దేవస్థానం తరఫున కలెక్టర్ దంపతులను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు.
దుకాణదారుడు
పొందూరు : బంగారాన్ని తక్కువ ధరకే ఇస్తామని ఆశ చూపించి డబ్బులు దోచుకున్న ఘటన పొందూరు మండలం రాపాక కూడలి వద్ద చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. రాపాక సెంటర్లో ఫొటోఫ్రేమ్ దుకాణానికి వారం కిందట ఇద్దరు సీ్త్ర, పురుషులు వచ్చి ఫొటోఫ్రేమ్లు కొనుగోలు చేశారు. ఈ నెల 10న అదే దుకాణానికి మళ్లీ వచ్చి తాము కూలి పనులు చేసుకుని జీవిస్తున్నామని, పని చేసేచోట 200 గ్రాముల బంగారం దొరికిందని నమ్మబలికారు. తమకు డబ్బులు అవసరం పడిందని, అందులో సగం బంగారం రూ.5 లక్షలకే ఇస్తామని చెప్పారు. దీంతో దుకాణదారుడు బంగారం తీసుకుని తెలిసిన వారి వద్ద పరీక్షించగా నిజమైన బంగారమేనని తేలింది. అయితే, ప్రస్తుతం తన వద్ద అంత డబ్బులేదని, మరుసటి రోజు రమ్మని చెప్పి పంపించేశాడు. ఈ నెల 11న మరలా రావడంతో దుకాణదారుడు తన వద్ద ఉన్న రూ.1.30 లక్షలు ఇవ్వగా సదరు వ్యక్తులు బంగారం ముక్క ఇచ్చి మిగిలిన డబ్బుల కోసం తర్వాత రోజు వస్తామని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. దుకాణదారుడు మరుసటి రోజు బంగారాన్ని పరిశీలించగా అది నకిలీ బంగారమని తేలింది. మిగిలిన డబ్బుల కోసం ఆ ఇద్దరూ వస్తారని ఎదురుచూసినప్పటికి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడి వివరాలు లభ్యం
నరసన్నపేట: ఉర్లాం రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్పై బుధవారం మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి వివరాలు లభ్యమయ్యాయి. మృతుడు అల్లాడకు చెందిన పట్ట అప్పలరామయ్య(85)గా ఆమదాలవలస రైల్వే పోలీసులు గుర్తించారు. భార్య దాలమ్మ, కుమారుడు సింహాద్రిలు మృతుడిని గుర్తించారు. ఆదివారం పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు రైల్వే హెచ్సీ మధుసూదనరావు తెలిపారు. బుధవారం ఉదయం గుర్తు తెలియని రైలు ఢీకొని అప్పలరామయ్య మృతి చెందాడని చెప్పారు.


