శ్రీకాకుళం కల్చరల్: యోగాంధ్ర 2026 వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీకాకుళం కార్గిల్ పార్కులో ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. గురుకుల పాఠశాల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై యోగాసనాలు వేశారు. షిర్డీ సాయి యోగ కేంద్రం శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది పలు రకాల ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులను నేర్పించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణకు కృషి
పాతపట్నం: గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణకు సత్యసాయి సేవా సంస్థలు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు తెలిపారు. పాతపట్నం మండలం చిన్నమల్లిపురంలో సత్యసాయి బాబా మందిరం వద్ద శ్రీసత్యసాయి ట్రైబుల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాంను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన గర్భిణులకు, బాలింతలకు, మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సుమారు 70 గిరిజన గ్రామాల్లో మూడేళ్ల పాటు ప్రణాళిక రూపొందించామన్నారు. శ్రీకా కుళం జిల్లాలో ఆరు గిరిజన గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు, కో–ఆర్డినేటర్ పప్పల నాగేశ్వరరావు, ఎన్.లలిత, కె.వి.రమణమూర్తి, బి.నర్సింహమూర్తి, అన్నంనాయుడు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
సరిహద్దులో వాహనాల తనిఖీ
పాతపట్నం: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు చెక్పోస్టు వద్ద పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.సన్యాసినాయుడు శనివారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు ఉంచుకోవాలని, పరిమితికి మించిన లోడుతో వాహనాలను నడపవద్దని చెప్పారు.
మాజీ సైనికుల సేవలు అభినందనీయం
శ్రీకాకుళం కల్చరల్ : డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం సేవలు అభినందనీయమని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావు అన్నారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్త రోడ్ ఆర్మీ క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసి మజ్జిగ చలివేంద్రం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బాటసారులకు, వాహన చోదకులకు వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించాలనే దృక్పథంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం మాట్లాడుతూ జీవితాంతం ప్రజాసేవలో నిమగ్నమవుతామన్నారు. కార్యక్రమంలో చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు, క్యాంటీన్ మేనేజర్ పప్పల గోవిందరావు, లయన్ పొన్నాడ రవి, లయన్ నటుకుల మోహన్, మీడియా ప్రతినిధి జోగి నాయుడు, జనరల్ సెక్రటరీ పి.మురళీధరరావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్.రామకృష్ణ, కోశాధికారి ఎం.సింహాచలం, మహిళా సెక్రటరీ డి.భారతి, జి.అమ్మన్నమ్మ, కె.జగ్గమ్మ, ఎ.లక్ష్మి, పి.జమున, పి.లీలాకుమారి, జి.సౌజన్య, పి.భారతమ్మ, ఎం.ఈశ్వరమ్మ, జి.అరుణ, ఎం.లలితకుమారి, బి.భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


