మరమ్మతులు చేస్తుండగా
● స్తంభం నుంచి కిందపడి ప్రైవే ట్ లైన్మేన్కు తీవ్ర గాయాలు
● మూడు గంటల పాటు ఘటనా స్థలంలోనే నరకయాతన
మెళియాపుట్టి: మాకనాపల్లి గ్రామానికి చెందిన ప్రైవేటు లైన్మేన్ ఇప్పిలి మోహన్ విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా షాక్కు గురై కిందపడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మెళియాపుట్టి మండల కేంద్రంలో శుక్రవారం వీచిన ఈదురు గాలులకు విద్యుత్ అంతరాయం కలగడంతో మోహన్ మరమ్మతులు చేయడానికి శనివారం రట్టిణి గ్రామం వెళ్లాడు. ఇంతలో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై కిందపడ్డాడు. సాయంత్రం 5.35 గంటలకు ఘటన జరగ్గా.. పడిపోయిన చోటే 8 గంటల వరకు ఉన్నాడు. అంబులెన్స్ సైతం రాకపోవడంతో చివరికి బొలెరో వాహనంలో మంచంపై వేసుకుని మెళియాపుట్టి పీహెచ్సీకి తరలించారు. మెరుగైన చికిత్స కోసం టెక్కలి ఆస్పత్రికి తరలించారు. వెన్నెముకకు బలమైన గాయమైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగి మూడు గంటలపాటు పడిన చోటే నరకం అనుభవించినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదనీ గ్రామస్తులు, మోహన్ భార్య దివ్య ఆవేదన ద్యక్తం చేసింది. 108కు సమాచారం ఇస్తే లైన్స్ బిజీగా ఉన్నాయని, చివరికి వజ్రపుకొత్తూరు అంబులెన్స్ ఆసుపత్రి వద్దకు వచ్చిందని రట్టిణి యువకులు చెబుతున్నారు.


