రణస్థలం: శ్యాంపిస్టన్స్ యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వరిసాం వద్ద శ్యాంపిస్టన్స్ ప్లాంట్ – 2 పరిశ్రమ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో పరిశ్రమ వద్ద శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలు, గ్రామ పంచాయతీ పెద్దలు, కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ పరిశ్రమలో 600 మంది కార్మిక కుటుంబాలకు అన్యాయం జరుగుతోందన్నారు. 58 ఏళ్ల వరకు కార్మికులకు సర్వీస్ ఉంటుండగానే 30 ఏళ్ల సర్వీస్ పూర్తయిందని 150 మంది కార్మికులను 50 ఏళ్లకే ఉద్యోగాలు నుంచి తొలగించడం సరికాదన్నారు. ధరలు పెరుగుతున్నా ఎనిమిదేళ్లుగా వేతన ఒప్పందం జరగడం లేదన్నారు. వేతనాలు కూడా మూడు నెలలకోసారి ఇస్తున్నారని చెప్పారు. ఏప్రిల్, మే నెలల పెండింగ్ వేతనాలు వెంటనే డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరినందుకు అన్యాయంగా ఏడుగురు యూనియన్ నాయకులను ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. సమావేశంలో పైడిభీమవరం మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకులు లంకలపల్లి ప్రసాదరావు, ఎంపీటీసీలు ఆకలి శ్రీనివాసనావు, ఎం.దుర్గారావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, వివిధ సంఘాల నాయకులు కె.కళ్యాణి, మణికొండ ఆదినారాయణ, ఎన్.వి.రమణ, పి.రామకృష్ణ, అంబటి సత్యనారాయణ, ఎస్.లక్ష్మణరావు, ఎం.అప్పలనర్సయ్య, గొర్లె కిరణ్, ఆర్.ఎస్.నాయుడు, జీరు రాము, బి.తోటయ్య, ఎం.కూర్మారావు, ఎన్.నాగేశ్వరరావు, కె.జోగేష్ తదితరులు పాల్గొన్నారు.


